మండు వేసవిలోనూ విరగకాసే ‘గోరు చిక్కుడు’
తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ భారీ దిగుబడులు
‘గోరు చిక్కుడు’.. కరువు రైతుల కల్పవృక్షంగా ఖ్యాతిపొందింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడుతుంది. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని అధిక దిగుబడులను ఇస్తుంది. అంతగా సారవంతం కాని భూముల్లోనూ విరగకాస్తుంది. ఆహార పంటగానే కాకుండా.. పశుగ్రాసంగా, వాణిజ్య పంటగానూ దీనికి మంచి డిమాండ్ ఉన్నది. అందుకే, మెట్ట ప్రాంతాల్లోని రైతులు వేసవికాలంలో సాగు చేసేందుకు ‘గోరు చిక్కుడు’ అత్యంత అనుకూలంగా ఉంటుంది.
గోరు చికుడు ఉష్ణమండలపు పంట. వేడి వాతావరణంలోనే ఇది ఎక్కువగా సాగవుతుంది. తొలిదశలో ప్రత్యేకించి మొలకెత్తే సమయంలో 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. కొమ్మలు వచ్చే సమయంలో 32 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. అదే పూత దశలో ఎంత ఎకువ ఉష్ణోగ్రత ఉంటే.. దిగుబడి అంతగా పెరుగుతుంది. ఈ లక్షణాలతో గోరు చిక్కుడు వేసవి పంటగా గుర్తింపు పొందింది. నీటి ఎద్దడిని తట్టుకొంటూ అధిక దిగుబడి ఇస్తుంది.
అనుకూల నేలలు
ఉదజని సూచిక 7-8.5 మధ్య ఉండి, మధ్యస్థ, తేలికపాటి నేలల్లో గోరు చిక్కుడు బాగా పెరుగుతుంది. నీటి నిల్వ భూములు, నల్లరేగడి భూములు, గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దీనిని సాగు చేయకపోవడమే మంచిది.
నేల తయారీ
వేసవిలో ముందుగానే లోతు దుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు, మూడుసార్లు పొలాన్ని కలియదున్నాలి. నీరు ఇంకేలా నేలను తయారు చేసుకోవాలి. భూమిలో నత్రజనిని స్థాపించి, భూసారం పెంచుకోవాలి.
విత్తన రకాలు
కాయగూరల కోసం : పూసా నవబహార్, పూసా సాదా బహార్, దుర్గా బహార్ రకాలు అనుకూలం.
విత్తనాల జిగురు కోసం : హెచ్జీ-365, హెచ్జీ-563, ఆర్సీజీ-1066, ఆర్సీజీ-1003.
పశుగ్రాసాల కోసం : హెచ్ఎఫ్-119, హెచ్ఎఫ్-156 వంటి రకాలు అనుకూలం.
విత్తనం నాటే సమయాలు…
ఎండలు ముదిరేలోపే విత్తనాన్ని నాటుకోవాలి. లేకుంటే దిగుబడి తగ్గిపోతుంది. చాలామంది రైతులు వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేస్తుంటారు. అయితే, సిఫార్సు మేరకు ఎకరానికి మొకల సాంద్రత ఉండేలా చేసేందుకు, మొలక శాతం పెరిగేందుకు, అంతర సేద్యపు పనులకు అనువుగా ఉండేందుకు వరుసలలో విత్తనాలు నాటుకోవడం మంచిది. మొక్కల మధ్య కనీసం 20 సెం.మీ దూరంతో నాటుకోవాలి. కొమ్మలు ఉత్పత్తి చేసే రకాలైతే వరుసల మధ్య 50 సెం.మీ., ఏక కాండం రకాలయితే వరుసల మధ్య 33 సెం.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. నాగలి లేదా సీడ్ డ్రమ్తో విత్తనం వేయాలి.
విత్తన మోతాదు
ఎకరానికి 8 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తడానికి ముందే కిలో విత్తనానికి 4 గ్రా. ట్రైకోడెర్మా లేదా 2 గ్రా. కార్బెండజిమ్తో శుద్ధి చేయాలి. ఆ తర్వాత రసం పీల్చే పురుగుల మందుతో శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 40 గ్రా. చొప్పున సిఫార్సు చేసిన రైజోబియం జీవ ఎరువును పట్టించాలి. ఇందుకోసం లీటర్ నీటిలో 200 గ్రా. రైజోబియం కల్చర్ను 200 గ్రా. బెల్లం ద్రావకం కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమ ద్రావణాన్ని విత్తనాలపై పొరగా ఏకరీతిగా పట్టించాలి. ఆ తర్వాత అరగంటపాటు నీడలో అరబెట్టాలి. 24 గంటల తర్వాత విత్తనాలను విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం
గోరు చిక్కుడు పంటకు తొలి దశలో కొద్దిమొత్తంలోనే నత్రజని అవసరం. హెక్టారుకు 20 కిలోల నత్రజని, 410 కిలోల భాస్వరం అవసరం అవుతుంది. వీటిని విత్తనంతోపాటే వేయాలి. విత్తడానికి 15 రోజుల ముందు హెక్టారుకు 12.5 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేసుకొంటే మంచిది.
నీటి యాజమాన్యం
ఉష్ణ, ఉప ఉష్ణ ప్రాంతాలలో గోరు చికుడును పూర్తిగా వర్షాధారంగా పండించవచ్చు. అయితే పూత, విత్తనం ఏర్పడే దశలో నీటి ఎద్దడి ఉంటే, ఒక నీటి తడినివ్వాలి. హెక్టారుకు 3-5 టన్నుల చొప్పున పంట వ్యర్థాలను వేస్తే, నేలలో తేమశాతం పెరుగుతుంది. వర్షాధార పరిస్థితులలో విత్తిన 25, 45 రోజుల తర్వాత 0.1 శాతం థయోయూరియాను పిచికారీ చేస్తే దిగుబడులు పెరుగుతాయి.
కలుపు యాజమాన్యం
పంట తొలి 10-15 రోజులలో కలుపు నివారణ చేపట్టాలి. 25 నుంచి 45 రోజులలో రెండుసార్లు చేతితో కలుపు తీయించాలి. కూలీల కొరత ఉంటే, హెక్టారుకు 500 లీటర్ల నీటిలో 2.5-3.3 లీటర్ల పెండిమిథాలిన్ కలుపు మందును కలిపి విత్తనాలు నాటిన రెండు రోజుల్లో పిచికారీ చేయాలి. లేదా పంట వేసిన 20-25 రోజులకు హెక్టారుకు 500 లీటర్ల నీటిలో 400 గ్రా. చొప్పున ఇమజితాపైర్ కలుపు మందును కలిపి పిచికారీ చేసుకోవాలి.
తెగుళ్ల నివారణ
ఆకుమచ్చ తెగులు : ఆల్బర్నేరియా ఆకుమచ్చ తెగులు లక్షణాలు కనిపిస్తే, హెక్టారుకు 500 లీటర్ల నీటిలో 2 కిలోల జినెస్ కలిపి, 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
బూడిద తెగులు : దీని నివారణకు హెక్టారుకు 21-25 కిలోల పొడి గంధకం లేదా 2-8 కిలోల తడి గంధకం లేదా లీటరు నీటిలో 1.15 మి.లీ. డినోక్యాప్ కలిపి పిచికారీ చేయాలి.
ఎండు తెగులు : దీనివల్ల మొక్కలు నిలువుగా ఎండిపోతాయి. దీని నివారణకు ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి. కిలో ట్రైకోడెర్మా విరిడి, 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలో వేపపిండిని కలిపి వారం రోజులు నీడలో మాగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఆఖరిదుక్కిలో వేసుకోవాలి. తెగులు ఇతర మొక్కలకు వ్యాపించకుండా లీటర్ నీటిలో 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మొక్క చుట్టూ నేల తడిచేలా పోయాలి. పంట మార్పిడి పాటించాలి.
దిగుబడి : వర్షాధార పంటలో హెక్టారుకు 7-18 క్వింటాళ్లు, నీటి వసతి ఉన్న పొలంలో హెక్టారుకు 12-15 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. కాయలు లేతగా ఉన్నప్పుడే కోసి మార్కెట్కు తరలించాలి. ముదిరిన కాయల్లో పీచుశాతం ఎక్కువై, నాణ్యత తగ్గుతుంది. జిగురు పంట కోసం సాగు చేసే రైతులు, కొనుగోలుదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవడం మంచిది.
విత్తనోత్పత్తి
గోరుచికుడులో రైతులే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. ఇందుకోసం అంతకు ముందు గోరుచికుడు వేయని పొలాన్ని ఎంచుకోవాలి. ఇతర పంటలకు కనీసం 10 మీటర్ల దూరంలో గోరు చిక్కుడు సాగు చేసుకోవాలి. ఇతర రకాల మొకలు, తెగులు సోకిన మొకలు, కేళీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు కలుపు నివారణ చేపట్టాలి. కోత సమయంలో ఏపుగా పెరిగిన మొక్కల నుంచి కాయలను వేరుగా సేకరించాలి. వాటిని నీడలో ఆరబెట్టి, విత్తన తేమశాతాన్ని 8 నుంచి 0 శాతానికి తీసుకురావాలి. ఆ తర్వాత విత్తనాలను కార్బెండజిమ్తో శుద్ధిచేసుకోవాలి. వాటిని డబ్బాలలో నిల్వ చేసుకొని, ఆ తర్వాత పంటకు విత్తనాలుగా వాడుకోవచ్చు.
తెలంగాణకు అనుకూలం..
తెలంగాణలో వేసవికి అనుకూలమైన పంటగా గోరు చిక్కుడును సాగు చేసుకోవచ్చు. సరైన విత్తనాన్ని ఎంచుకొని, శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. సారవంతం కాని భూముల్లోనూ ఇది బాగా పండుతుంది. నీటి ఎద్దడిని సమర్థంగా తట్టుకోగలదు. గింజలో 18 శాతం ప్రొటీన్, 32 శాతం పీచు పదార్థాలు, 30 – 33 శాతం జిగురు ఉంటుంది. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో ‘గోరు చికుడు జిగురు’ ప్రధానమైంది.
– డా. పిడిగెం సైదయ్య,
రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం
సీనియర్ శాస్త్రవేత్త.
– మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి