Carrot cultivation | క్యారట్లను సలాడ్ గా, తినడానికి పలు రకాల కూరలు, స్వీట్లు, తయారు చేయడానికి వాడతారు. క్యారెట్లో ‘అంతో సైనిక్’ ఎక్కువగా ఉండడం వల్ల ఎర్రగా ఉండే రకాలు, కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల నారింజ రంగులో ఉండే రకాలు లభ్యమవుతాయి. క్యారెట్లో విటమిన్ ఏ తో పాటుగా ప్రొటీన్లు, లవణాలు, విటమిన్లు, ఎక్కువగా ఉండడం వల్ల మంచి పౌష్టికాహారంగా గుర్తింపు పొందింది. క్యారెట్లో ఆసియా, హీరోపియాన్ రకాలు ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని సాగు చేసుకోవాలి.
క్యారెట్ పంట శీతాకాలానికి అనువైన పంట. ఈ పంట 18-25 డిగ్రీలు గల తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అధిక దిగుబడులతో పాలు మంచి నాణ్యమైన దుంపలను అనువైన వాతావరణం. ఈ పంట 100 – 110 రోజుల్లో కోతకొస్తుంది. ఆగస్టు నుంచి జనవరి మధ్య కాలంలో క్యారెట్ విత్తుకోవడం వల్ల మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
విత్తన రకాలు
పూస కేసర్
వీటి దుంపలు లోకల్ రెడ్ కన్నా నెలరోజులు ఎక్కువగా నేలలోనే ఉన్నా నాణ్యత చెడిపోదు. అధిక దిగుబడినిచ్చే ఎర్ర దుంప రకం. దీనిలో కెరోటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
ఎర్లి నాన్టిస్
ఈ రకం 12 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. పల్చటి పైపొర కలిగి నారింజ రంగు కండ కలిగి ఉంటుంది. దుంపలు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో కోతకొస్తాయి.
చాన్ టని
ఈ రకం నిల్వ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వేరు దుంప 11 నుంచి 12 సెంటి మీటర్ల పొడవు ఉంటుంది. 3 నుంచి 5 సెం. మీ మందంతో నారింజ రంగులో ఉంటుంది. శీతోష్ణస్థితి మండలానికి బాగా అనుకూలంగా ఉంటుంది.
పూస యమధగ్ని
ఈ రకం విత్తనం త్వరగా కాపు వచ్చే లక్షణం కలిగి ఉంటుంది. దుంపల వేర్లు 15 – 16 సెం.మీ పొడవు నారింజ రంగుతో ఉంటాయి. ఎక్కువ కెరోటిన్ శాతంతో అధిక దిగుబడి ఇచ్చే రకం ఇది.
నేలలు
మురుగు నీటి వసతి కలిగిన లోతైన ఇసుకతో కూడిన గరప నేలలు ఈ పంటకు అనుకూలం. బరువైన బంక మట్టి నేలలు పనికిరావు. నేలలో ఉదజని సూచిక 6.5 ఉంటే మంచిది.
వాతావరణం
అధిక ఉష్ణోగ్రతతో దుంపల పెరుగుదల, రంగు, నాణ్యత తగ్గుతుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద దుంపల రంగు ఎక్కువగా ఉండి దుంపలు పొడవుగా వస్తాయి. నాణ్యమైన దుంపల దిగుబడికి 22-24 డిగ్రీల మద్య ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. 15 సెంటీ డిగ్రీల కన్నా తక్కువ 25 సెంటీ డిగ్రీల కన్నా ఎక్కువ ఉస్నోగ్రత ఉంటే కెరోటిన్ శాతం తగ్గుతుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏడాది పొడుగునా క్యారెట్ను సాగు చేసుకోవచ్చు.
విత్తన మోతాదు
ఎకరా భూమిలో నాటుకోవడానికి 2 నుంచి 2.5 కేజీల విత్తనం సరిపోతుంది.
విత్తుకునే కాలం
ఆగస్టు నుంచి నవంబర్ నెల వరకు విత్తుకుని సాగు చేసుకోవచ్చు. ప్రతి 15 రోజుల తేడాతో ఆగస్టు నుంచి నవంబర్ వరకు విత్తుకుంటే ఎక్కువ దిగుబడి పొందేందుకు వీలుంటుంది.
ప్రధాన పొలం తయారీ
దుక్కిని 4, 5 సార్లు దున్నుకొని చదును చేసుకోని సిద్ధంగా పెట్టుకోవాలి. క్యారెట్ను చిన్న చిన్న మడులు లేదా బోదెలు తయారు చేసి సాగు చేసుకోవాలి. చిన్నచిన్న మడుల్లో 22.5 సెం. మీ దూరం వరుసలతో విత్తనాలను 1- 1.5 సెం. మీ లోతులో విత్తుకోవాలి. లేదా 30 సెం.మీ దూరంతో బోదెలు తయారుచేసి 5సెంటి మీటర్ల దూరంలో విత్తనాలు పడేలా విత్తుకోవాలి. విత్తనాలు చిన్నవిగా ఉండడం వల్ల కిలో విత్తనానికి 10 కిలోల సన్నని పొడి ఇసుక కలిపి విత్తుకుంటే సరైన దూరంలో విత్తుకోవడానికి సులువుగా ఉంటుంది. విత్తనాలు విత్తుకున్న వారం రోజుల్లో మొలకలు వస్తాయి.
నీటి యాజమాన్యం
అధిక దిగుబడి కోసం ఎక్కువ సార్లు నీరు పెట్టాలి. నేల స్వభావం వాతవరణ పరిస్థితులను బట్టి 5 నుండి 7 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. దుంపల పెరుగుదల దశలో తేమ తగినంత ఉండేలా చూసుకోవాలి. ఆకులు వాడిపోయినట్లు కనిపించక ముందే తప్పని సరిగా నీటి తడులు ఇవ్వాలి. నీటి యజమాన్యంలో ఒడుదొడుకులు ఉంటే నాణ్యత దెబ్బతింటుంది.
ఎరువులు
క్యారెట్ మొక్కకు ఎక్కువ పోషక పదార్థాలు అవసరం. అందుకని బాగా మాగిన పశువుల ఎరువు ఎకరాలకు 7 నుంచి 10 టన్నులు వేసుకోవాలి. పశువుల ఎరువుతో పాటుగా 20 కిలోల భాస్వరం, 15 కేజీల పోటాష్, 20 కిలోల నత్రజని రెండు సమభాగాలుగా చేసి ఆకరి దుక్కిలో 10 కిలోలు విత్తిన నాలుగు వారాల తర్వాత మిగిలిన ఎరువులు వేసిన వెంటనే తప్పనిసరిగా నీరు ఇవ్వాలి.
తెగుళ్ల నివారణ
క్యారెట్ లో దుంప కుళ్ళు రస్ట్ ఫ్లై ఈగ ద్వారా వస్తుంది. ఈ ఈగ మొక్కపై గుడ్లు పెట్టడం వల్ల దాని లార్వాలు దుంపలోనికి వెళ్లి దుంపను తినడం ప్రారంభిస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కల ఆకులు వడలి పోతాయి. లేదా ఆకులు తెల్లగా మారుతాయి. ఈ లక్షణాల ఆధారంగా మొక్కలు దుంపకుళ్ళు బారిన పడ్డట్లుగా గుర్తించవచ్చు.
నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 మీ.లీ మాలాథియాన్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ముందస్తు చర్యగా పంట వయస్సు 4, 7, 10 వ వారాలలో పిచికారి చెయ్యడం మంచిది.
ఆకుమచ్చ తెలుగు తెగులు వల్ల ఆకులపై చిన్న చిన్న ,మచ్చలుగా ఏర్పడి ఆకు మొత్తం విస్తరించి వడలిపోయి మొక్క ఎండిపోతుంది. దీనికి నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 3 గ్రాముల మంకొజేబ్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
బూడిద తెగులు ఆకులపై, ఆకుల కింద బూడిద రంగు ఏర్పడుతుంది. దీనివల్ల మొక్కల ఎదుగుదల మందగిస్తుంది. దీని నివారణ చర్యగా 1 లీటర్ నీటికి, నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు వేసుకొని పిచికారి చేసుకోవాలి.
అంతర కృషి
బొదెలలో మొక్కలు ఒత్తుగా ఉంటే 5 సెంటీమీటర్లకు ఒకటి చొప్పున ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. ఖాళీగా ఉన్న ప్రదేశాలలో గింజలు విత్తుకోవాలి. విత్తిన నెలరోజుల లోపు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. దుంపలు పెరిగేటప్పుడు ఎండ తగలకుండా మట్టిని ఎగత్రోయాలి.
దుంపలు తవ్వకం
వేరు దుంపలు మొదట తెల్లగా ఉండి తర్వాత పసుపు రంగులోకి.. క్రమక్రమంగా ముదురు నారింజ లేదా ఎరుపు రంగుకు మారుతాయి. దుంపలు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఆకులతో సహా దుంపలను సేకరించాలి. పక్వానికి వచ్చిన తర్వాత కూడా దుంపలను తీయకపోతే దుంపలపై వేర్లు మొలకెత్తుతాయి.