ప్రస్తుతం తెలంగాణలోనూ చేపల చెరువులు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో నర్సరీల్లో చేప పిల్లలను పెంచేవారి సంఖ్య కూడా పెరుగుతున్నది. అయితే నర్సరీల్లోని చేప పిల్లలకు ఎలాంటి దాణా వాడాలో సరైన అవగాహన లేకపోవడం వల్ల.. చేప పిల్లలు ఎదగలేక పోతున్నాయి. ఫలితంగా చెరువుల్లో వదిలిన తర్వాత సరిగ్గా పెరగకపోవడం లేదా చనిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ముఖ్యంగా మన ప్రాంతంలో ఎక్కువ ధర పలికే కొరమీను (బొమ్మె) చేప పిల్లల పెంపకంలో సరైన దాణా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.
నర్సరీల్లోని కొరమీను (బొమ్మె) చేప పిల్లల ముఖ్య ఆహారం.. ప్లవకాలు (నీటిలో తేలుతూ కదిలే జీవులు). అందువల్ల నర్సరీల్లో ప్లవకాల సాంద్రత నిలకడగా ఉండేలా చూడాలి. క్రమంగా చేప పిల్లలను అనుబంధ ఆహారానికి అలవాటు చేయాలి. ముఖ్యంగా 40% మాంసకృత్తులు ఉండే అనుబంధ దాణా ఇవ్వాలి. ఇందుకోసం 80% ట్రాష్ఫిష్, 10% తవుడు, 10% వేరుశనగ మిశ్రమంతో దాణా తయారు చేసుకోవాలి.
చేప పిల్లలకు సరిగ్గా దాణా ఇవ్వకపోతే.. అందులోని పెద్దవి.. చిన్నవాటిని తినివేస్తాయి. మొదటి 15 రోజులు విత్తనం (చేప పిల్లల) మొత్తం బరువుకు 20%, ఆ తర్వాత 10% చొప్పున దాణా ఇవ్వాలి. ఉదయం పూట 60%, సాయంత్రం 40% మేత ఇవ్వడం మంచిది. అవసరాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి సుమారు 50% వరకు కుండీల్లో నీటిని మార్చాలి. 40 నుంచి 50 రోజుల్లో విత్తనం (చేప పిల్లలు) వేలు సైజుకు పెరుగుతుంది. ఇవి పెద్ద చెరువుల్లో పెంచడానికి అనుకూలంగా ఉంటాయి.