తొర్రూరు, జూన్ 29 : ‘మోదీ నువ్వు తెలంగాణకు రావొద్దు. మంచి పనులు చేస్తున్న కేసీఆర్ను తిట్టి మా గడ్డమీదికి ఎట్ల వస్తవ్. చాలు మోదీ, చంపకు మోదీ. మోదీ డౌన్డౌన్.. కేసీఆర్ జిందాబాద్’ అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ప్యాండాతండాకు చెందిన లావుడ్యా రమేశ్ అనే రైతు తొర్రూరులో బుధవారం సెల్ టవర్ ఎక్కి నినాదాలు చేశాడు. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది.
తెలంగాణలో జరుగుతున్న పనులను అడ్డుకొనేందుకు పైసలు రానివ్వకుండా పుల్లలు పెడుతూ మా మీద ప్రేమ ఒలకపోయడానికి వస్తున్నావా? అని నిలదీశాడు. తప్పులు చేసుకొంటూ మళ్లీ కేసీఆర్పై అడ్డగోలుగా మాట్లాడుతున్నవ్.. మా తెలంగాణకు రాకు, మమ్మల్ని చంపకు అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలని అందరూ మొక్కుతున్నారని అన్నాడు. టవర్మీదనే కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశాడు. పోలీసులు నచ్చజెప్పి కిందికి దించారు. పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.