తాటాకు మచ్చ తెగులు : పసుపు పంటలో సెప్టెంబర్ నుంచి తాటాకు మచ్చ తెగులు కనిపిస్తుంది. ఆకులపై అక్కడక్కడా పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడుతాయి. ముదురు గోధుమ రంగులోని మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి, ఆకు కిందకు వాలుతుంది.
నివారణ : మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి. లీటరు నీటిలో 1 గ్రా. కార్బెండజిం లేదా 2.5 గ్రా. మాంకోజెట్, 0.5 మి.లీ. సబ్బు నీరు లేదా 1 గ్రా. థయోఫానేట్ మిథైల్ కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
ఇనుప ధాతు లోపం భూమిలో చౌడు, సున్నం, భాస్వరం ఎక్కువగా, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న భూముల్లో ఇనుప ధాతులోపం కనిపిస్తుంది. దీనివల్ల ఆకులు తెల్లగా మారుతాయి. ఆకు పరిమాణం తగ్గి అంచుల కణజాలం దెబ్బతింటుంది. పంట చేతికొచ్చే సమయంలో దుంపలు, కొమ్ములు చిన్నవిగా తయారై నాణ్యత లోపిస్తుంది.
నివారణ : దీనిని నివారించేందుకు మడిలో మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి. లీటరు నీటిలో 5 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ లేదా 10 గ్రా. అన్నభేది, 1 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి పైరుపై 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.