బెల్లంపల్లి, ఏప్రిల్ 17 : బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గంజాయి హబ్గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఇళ్ల ముందు విద్యార్థులు సిగరెట్లలో గంజాయి సేవిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెకిలి చేష్టలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల స్థానిక కాలనీ వాసులు ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డికి ఫిర్యాదు చేయడం బెల్లంపల్లిలో చర్చనీయాంశంగా మారింది. ఇళ్ల నుంచి తాము బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నామని, ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేయడం ఇక్కడి విద్యార్థులు గంజాయి మత్తులో ఏ స్థాయిలో జోగుతున్నారో అర్థమవుతున్నది.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పట్టణ శివారు ప్రాంతంలో ఉంది. అక్కడి నుంచి వంద మీటర్ల పరిధిలో పాత డంప్ యార్డు, నిర్మాణంలో ఉన్నా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. నిర్మానుష ప్రాంతం కావడంతో పట్టణంలోని పలు బస్తీల నుంచి యువత ఇక్కడికి వచ్చి మద్యం, గంజాయి సేవిస్తూ ఉంటారు. కళాశాలకు రాకపోకలు సాగించే విద్యార్థులు వీరిని చూసి ఆకర్షితులై గంజాయి మత్తుకు అలవాటు పడ్డారని తెలుస్తున్నది. కళాశాల సమీపంలోనే దుకాణాల్లో సిగరెట్లు కొని అందులో గం జా యి పెట్టి పీల్చుతున్నారు. సిగరెట్ అలవాటు ఉన్నవారే ఈ మహమ్మారికి ఎక్కువగా అలవాటు పడ్డారనే తెలుస్తున్నది. ఇటీవల గంజాయి విక్రయిస్తున్న నిందితులను కళాశాలకు సమీపంలో ఉన్న కొత్త బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు పట్టుకోవడం, అదే విధంగా రెండు రోజుల క్రితం పట్టణంలోని కన్నాల బస్తీలో ఓ ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతు న్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రూమెంటేషన్, ఎలక్ట్రానిక్, ఇన్స్ట్రూమెంటేషన్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఏడాదీ ప్రతి కోర్సులో 60 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతారు. మొత్తం 540 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా కళాశాల ఆవరణలోనే వసతి గృహాలున్నాయి. గతేడాది గంజాయి సేవించారని సీనియర్ విద్యార్థులు ఆరుగురిని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. తాజాగా నాలుగు రోజుల క్రితం రాత్రి సమయంలో గంజాయి మత్తులో ఇద్దరు విద్యార్థులు దాడి చేసుకున్న సంఘటన బయటకు రావడంతో వారిని హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. ఇటీవల కళాశాలలో ఓ విద్యార్థి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోగా లెక్చరర్లు మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఏడాది క్రితం ఓ విద్యార్థిని, విద్యార్థి మంచిర్యాలకు వెళ్లగా విద్యార్థిని సోదరుడు చూసి కళాశాల వచ్చి విచారణ చేయగా ఆ విద్యార్థిని కళాశాలలో లేకపోవడంతో కళాశాల లెక్చరర్లు అవాక్కయ్యారు. నైట్ వాచ్మెన్ ఉన్నా ప్రయోజనం లేకుండా ఉందన్నా ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతోనే బయటకు ఎవరూ వెళ్తున్నారో తెలియడం లేదు. రాత్రి పూట బయటకు వెళ్లినా విద్యార్థులపై చర్యలు తీసుకోకపోవడంతోనే అడ్డూ అదుపు లేకుండా తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొంత కాలం నుంచి విద్యార్థులు గంజాయి మత్తులో పడుతున్నా సంబంధిత అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల క్రితం విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని ఆరోపణలు ఉన్నాయి. కళాశాల సమీపంలో రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ లేకనే విద్యార్థులకు భయం లేకుండా పోయిందని, ఇప్పటికైనా పోలీసులు స్పందించి గంజాయి తాగే వారిపై నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
బెల్లంపల్లి, ఏప్రిల్ 17 :స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గంజాయి రవాణా, విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకుని ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నాం. ఆరు నెలల్లో 15 కేసులు నమోదు చేశాం. కన్నాల బస్తీలో ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని అరెస్టు చేశాం. పాలిటెక్నిక్ కళాశాల పరిసరాల వద్ద నిఘా పెట్టాం. ఇద్దరు కానిస్టేబుళ్లతో పెట్రోలింగ్ నిర్వహిస్తూ తానే స్వయంగా కళాశాల నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వరకు ఉన్న దారిలో ద్విచక్రవాహనంతో సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో సివిల్ డ్రెస్లో పెట్రోలింగ్ చేస్తున్నాను.
గత ఏడాది సీనియర్ విద్యార్థులు పిచ్చిపిచ్చి చేష్టలతో వెకిలి వేషాలు వేస్తే ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశాం. కళాశాల విద్యార్థులు ఎవరూ కూడా గంజా యి తీసుకోవడం లేదు. కళాశాల పరిసర ప్రాంతాల్లోనే ఇతరులు గంజాయి సేవిస్తున్నారు. సీసీ కెమెరాలు సరిగానే పని చేస్తున్నాయి. విద్యార్థులపై నిరంతంగా పర్యవేక్షణ చేస్తున్నాం. ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించాం. పరిసర ప్రాంతాల్లో గంజాయి సేవించడం అరికట్టాలని కోరాం.