ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడేలు, తండాలు, మారుమూల పల్లెల్లోనూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచే అడవిబిడ్డలు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. ఆదివాసీ జెండాలు ఆవిష్కరించారు. కుమ్రం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాలీకోమ్ వాయిస్తూ, డప్పు చప్పుళ్ల మధ్య స్త్రీ, పురుషులు సంప్రదాయ నృత్యాలు చేశారు. జై ఆదివాసీ.. జై జై ఆదివాసీ నినాదాలతో హోరెత్తించారు. నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్లో ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ బాపురావ్, ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కనులపండువగా సాగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చైన్గేట్ ప్రాంతంలోని కుమ్రం భీం, గోండు వీరుడ రాంజీగోండు విగ్రహాలకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ ఆదివాసుల హక్కులు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ఎందరో మహానీయులు త్యాగాలు చేశారన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకుగాను 1.52 లక్షల మంది అడవి బిడ్డలకు పోడు పట్టాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాల భూమిని 37 వేల కుటుంబాలకు అందజేస్తున్నామని తెలిపారు.
ఆదివాసీల గూడేలు, గిరిజన తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చామని, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎస్టీ రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్కే దక్కిందని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం చౌక్లోని భీం విగ్రహానికి స్థానిక మాజీ ఎంపీ నగేశ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేశ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజాడ్డితో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ తీశారు. ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట హిరాసుఖ జాగృతి సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డితో కలిసి భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బోథ్లో భగత్సింగ్ చౌక్ నుంచి బస్టాండ్లోని భీం విగ్రహం వరకు తుడుం మోగిస్తూ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని లింగట్లలో జడ్పీటీసీ జాదవ్ అనిల్ కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఉట్నూర్ మండల కేంద్రంలోని కుమ్రం భీం ప్రాంగణంలో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డితో కలిసి కలెక్టర్ రాహుల్రాజ్ భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇంద్రవెల్లి మండలంలో ఆదివాసీ జెండా ఆవిష్కరించి, కుమ్ర భీం చిత్రపటానికి ఆదివాసీ గిరిజన ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఫూలమాల వేసి నివాళులర్పించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ సురేశ్కుమార్, కాగజ్నగర్ మండలం గువ్వలగూడలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు పాల్గొన్నారు. మంచిర్యాల ఐబీలో గిరిజన సంక్షేమ శాఖ డీటీడీవో నీలిమ, కలెక్టర్ బదావత్ సంతోష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆదివాసీలు డప్పు చప్పుళ్ల నడుమ నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు.