ఎదులాపురం, మార్చి 16 : విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మౌళిక సదుపాయాలు, గిరిజన సంస్కృతిపై ప్రత్యేక దృష్టిసారిస్తూ జిల్లాలోని గిరిజన అభ్యుదయానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాయి సెంటర్ సభ్యులు, ఐటీడీఏ డైరెక్టర్లతో గురువారం పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలన్నారు. గిరిజన మహిళలు రక్తహీనతతో బాధపడకుండా పౌష్టికాహారం, చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సంస్కృతిపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఉన్న పనులకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల సాగు చేస్తున్న సుమారు 25వేల మందికి అటవీ హక్కు పత్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయడానికి ఇప్పటికే పత్రాలు ప్రింటింగ్ చేయించామన్నారు. జిల్లాలో 8500 మంది గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూములను హక్కు పత్రాలను అందిస్తామని తెలిపారు. ప్రతి నెల 4వ శనివారం రాయి సెంటర్ సమావేశాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. త్వరలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై ఉట్నూర్లో సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమీక్షిస్తామని తెలిపారు. అంతకుముందు సార్మేడీలు, ఆదిమ గిరిజనుల సలహా మండలి డైరెక్టర్ వారి సమస్యలను సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ దిలీప్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, సార్ మేడీలు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సం బంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీ య రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్లలో ప్ర మాదాలు జరుగకుండా ముందస్తు ఇండికేషన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వేగ నిరోధక స్ట్రిప్లను అమర్చాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేరడిగొండ నుంచి కుప్టి వరకు, టోల్ ప్లాజా నుంచి నేరడిగొండ గ్రామం వరకు సర్వీస్ రోడ్డు ఏర్పా టు చేయాలని తెలిపారు. గుడిహత్నూర్ నుంచి సీతాగొంది వరకు వెళ్లే దారిలో వేగ నిరోధకాలు, సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. పులిమడుగు, ఇంద్రవెల్లి, శ్యాంపూర్కు వెళ్లే రహదారిలో న్యారో బ్రిడ్జిల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో వాహనదారులకు తెలిసేలా రేడియం స్టిక్కర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రిమ్స్ ఎదుట ప్రమాదాల నివారణకు వేగ నిరోధకాలను అమర్చాలన్నారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఎస్పీ వీ ఉమేందర్, ఆర్అండ్బీ ఈఈ నర్సయ్య, పంచాయతీ రాజ్ ఈఈ మహావీర్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, పోలీస్, రవాణా, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
వేలాన్ని నిబంధనల మేరకు నిర్వహించాలి
రాజీవ్ స్వగృహ వేలాన్ని సజావుగా, నిబంధనల మేరకు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశంలో వేలం నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో కలిసి పరిశీలించారు. వేలం ప్రశాంతంగా నిర్వహించాలని, అవసరమైన ఏర్పాట్లు, సిబ్బందిని సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. గతంలో ఎక్కువ ప్లాట్లు వేలం ఉన్నందున ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం 58 ప్లాట్ల వేలానికి ఇప్పటి వరకు సుమారు 30 దరఖాస్తులు వచ్చాయని, గతంలో చేపట్టిన వేలానికి సంబంధించిన అనుభవమున్న సిబ్బందిని నియమించామని కలెక్టర్కు వివరించారు. వారి వెంట ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, గృహ నిర్మాణ శాఖ నోడల్ అధికారి బసవేశ్వర్ రావు, బహిరంగ వేలం నిర్వాహక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.