ఇంద్రవెల్లి : రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత ( Womens Empowerment ) , గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ( Collector Rajarshi Shah ) అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా మహిళా వారోత్సవాలల్లో భాగంగా శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రం ఐకేపీ కార్యాలయ ప్రాంగణంలో మహిళా సంఘాలు, గుడిహత్నూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోయా ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని శాసనసభ్యులు వెడ్మ బొజ్జుపటేల్ ( MLA Vedma Bojju Patel ) తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సోయాబీన్ పంట సాగు విస్తృతంగా ఉన్నప్పటికీ, స్థానిక ప్రాసెసింగ్ యూనిట్లు తక్కువగా ఉండటం వల్ల రైతులు, మహిళలు ఆశించిన స్థాయిలో లబ్ధి పొందలేకపోతున్నారని గుర్తించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ (ICRISAT) సాంకేతిక భాగస్వామ్యంతో రూ. 30 లక్షల వ్యయంతో ఈ సోయా ప్రాసెసింగ్ యూనిట్ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ప్రారంభ బాల్య అభివృద్ధి పై అవగాహన కల్పిస్తూ గర్భధారణ సమయం నుంచి శిశువుకు రెండు సంవత్సరాలు నిండే వరకు ఉండే 1000 రోజులు జీవితానికి బలమైన పునాది వంటివని తెలిపారు.
ఈ కాలంలో పిల్లల ఎదుగుదల కోసం పోషకాహారం, ఆరోగ్యం, ప్రారంభ విద్య, స్పందనాత్మక సంరక్షణ, భద్రత, తల్లిదండ్రుల శ్రేయస్సు అనే 6 సూత్రాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, డీడబ్యూవో మీల్కా, జడ్పీ సీఈవో రవి, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం మంజుల, మహిళా సంఘాల ప్రతినిధులు, ఐకేపీ సీసీలు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.