కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్గా నిలిచే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మూడు ముక్కలాట ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో స్పష్టత లేకపోయినా తమకంటే.. తమకే వస్తుందని నాయకులు ఇంతకాలం ప్రచారం చేసుకుంటూ వచ్చారు. తాజాగా కొత్త నాయకులు పుట్టుకొచ్చే సరికి టికెట్ల కోసం ధర్నాలు, రాస్తారోకోల స్థాయికి వెళ్తున్నారు. మర్సుకోల సరస్వతి, రాథోడ్ గణేశ్ ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్లో కొత్తగా రిటైర్డ్ ఆర్టీవో శ్యాంనాయక్ చేరడంతో ఇంతకాలం టికెట్పై ఆశలు పెంచుకున్న రాథోడ్ గణేశ్, మర్సుకోల సరస్వతి ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని శ్యాంనాయక్ ప్రచారం చేసుకోవడంతో పాటు ప్లెక్సీలు, వాల్ రైటింగ్ చేయిస్తున్నారు. దీంతో ఎవరికి వారే తమ వర్గీయులను పోగేసుకొని ధర్నాలు చేయిస్తున్నారు. నెల క్రితం రాథోడ్ గణేశ్కే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు ర్యాలీ నిర్వహించగా, గురువారం వాంకిడిలో మర్సుకోల సరస్వతి వర్గీయులు రాస్తారోకో నిర్వహించారు.
ఎవరికి వారే.. యమునా తీరే..
ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే.. యమునా తీరే.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్లుగా పనిచేస్తూ ఆశలు పెంచుకొన్న రాథోడ్ గణేశ్, మర్సుకోల సరస్వతీ వర్గాలు ఎవరికి వారుగా విడిపోయి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 6 నెలల క్రితం బట్టి విక్రమార్క పాదయాత్రలో సైతం మర్సుకోల సరస్వతీ వర్గం, రాథోడ్ గణేశ్ వర్గం మధ్య విభేదాలు బయట పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ వర్గం మర్సుకోల సరస్వతికి సపోర్ట్ చేస్తుండగా, మంచిర్యాలకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ వర్గం రాథోడ్ గణేశ్కు మద్దతు తెలుపుతున్నది. దీంతో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. మర్సుకోల సరస్వతీ వర్గం 10 రోజుల క్రితం ఆసిఫాబాద్లో రాస్తారోకో నిర్వహించింది. తాజాగా గురువారం కూడా వాంకిడిలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి మర్సుకోల సరస్వతికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల రోజుల క్రితం జైనూర్లో రాథోడ్ గణేశ్కు చెందిన వర్గం ర్యాలీ నిర్వహించి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తంమీద ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మూడు ముక్కలుగా విడిపోయి టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి అదృష్టం ఎవరిని వరిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.