మామడ, నవంబర్ 30 : వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. క్షణిక సుఖం మోజులో పడి కట్టుకున్న వారిని మట్టుబెడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మండలంలోని కమల్కోట్ తండాలో చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడిని చంపేసింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని అంతమొందించింది. మామడ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జీవన్రెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఈ నెల 25న కమల్కోట్ తండాకు చెందిన ధరంసోత్ సునీత తన భర్త గణేశ్ను చేపల వేటకు వెళ్దామని ఆదర్శనగర్ గ్రామ గోదావరికి తీసుకెళ్లింది. తానే స్వయంగా తయారు చేసిన గుడుంబాను భర్తతో తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత ప్రియుడు రాథోడ్ అనిల్తో కలిసి చీర కొంగును గణేశ్ అలియాస్ గంగాధర్ మెడకు బిగించి హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి వారు పరారయ్యారు. మృతుడి తల్లి ప్రేమల బాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ మేరకు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కేసును ఛేదించిన సోన్ సీఐ రాంనరసింహారెడ్డి, ఎస్ అశోక్ను అభినందించారు.