ఆదిలాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో విశేషమైన అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఆయన ప్రసంగించారు. జిల్లాలో రైతుబంధు పథకంలో భాగంగా 1,34,606 మంది రైతులకు రూ.191 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతుబీమా పథకంలో భాగంగా 531 మంది రైతు కుటుంబాలకు రూ. 26.55 కోట్లు అందజేశామన్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ.202 కోట్లతో 219 చెరువుల మరమ్మతు పనులు చేపట్టి 40,860 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 1,234 ఆవాసాలకు నల్లానీరు అందిస్తున్నామని, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన 40,496 మంది గర్భిణులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
రిమ్స్లో 220 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఎనిమిది రకాల ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారు. జిల్లాలోని 75,621 మంది లబ్ధిదారులకు ప్రతినెలా రూ.15.96 కోట్ల ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా 27,941 మంది ఆడబిడ్డల వివాహాలకు రూ.248.76 కోట్లు అందజేశామన్నారు. దళితబంధు పథకంలో భాగంగా 1,883 భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు రూ.208.27 కోట్లతో 4,787 ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా 12,199 గర్భిణులు, బాలితలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 1,77,370 కుటుంబాలకు ప్రతి నెలా 4,076 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు ఉపాధి మెరుగుపర్చడానికి 238 చెరువులు, రెండు ప్రాజెక్టుల్లో 123.25 లక్షల చేప పిల్లలను వదిలినట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా రూ.31.32 కోట్లతో 200 పనులు చేపట్టడం జరిగిందని, జిల్లాలో నేరాల నియంత్రణకు కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి 500 సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.