ఆసిఫాబాద్, డిసెంబర్ 4 : ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్కే జై కొట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినప్పటికీ ఇక్కడ మాత్రం గులాబీ వైపే మొగ్గు చూపారు. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేయగా, బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికే మద్దతుగా నిలిచారు. డిసెంబర్ 3న జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తూ నియోజవర్గంలో 17 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో అత్యధికంగా బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మికి 83,052 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ అభ్యర్థి శ్యాంనాయక్కు 60,242 ఓట్లు పడ్డాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి కొట్నాక విజయ్కుమార్ 16,469 ఓట్లు సాధించారు.
బీజేపీ అభ్యర్థి ఆజ్మీ రా ఆత్మారాం నాయక్ 6,613,బీఎస్పీ అభ్యర్థి ప్రభాకర్ 3544, ప్రజాపాలన పార్టీ ఆజ్మీరా రాం నాయక్ 2569, గోండ్వాన గణతంత్ర పార్టీ అభ్య ర్థి ఆత్రం గోవర్ధన్ 759, జనతా కాంగ్రెస్పార్టీ అభ్యర్థి గోవింద్ భూక్యాకు 463, విద్యార్థి రాజయకీయ పార్టీ అభ్యర్థి నైతం తిరుపతి 408, బహుజన ముక్తి పార్టీ భూక్య పల్లవి 664, స్వతం త్య్ర అభ్యర్థులు కొట్నాక కిషణ్రావు 1534, పుసం సోనేరావు 847, మెస్రం నవీన్కుమార్ 1481, రెబ్బెన నాగరాజు 888, వసంత్ సింగ్ జాదవ్ 989, సిడాం అన్నీగా 2093, సిడాం ధర్ము 587 ఓట్లు సాధించారు. 1516 ఓట్లు నోటాకు పడగా, 59 ఓట్లు రిజెక్టు అయ్యాయి.
నియోజవర్గంలో బలమైన అభ్యర్థిగా పేరు తెచ్చుకున్న కోవలక్ష్మిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రల చేసింది. కానీ.. ప్రజల్లో ఆమెకు ఉన్న ఆదరణముందు అవ్వేవీ పని చేయలేదు. బీఆర్ఎస్ను ఓడించేందుకు ఆదివాసీ తెగలకు చెందిన పలువురిని బరిలో దింపి వారికి ఆర్థికంగా అండగా నిలిచినట్లు సమాచారం. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్,బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నుంచి కాకుండా చిన్న చిన్న పార్టీల నుంచి సైతం బీ-ఫాంలు తీసుకువచ్చి బరిలో ఉంచారు. ఆదివాసీ ఓట్లను కొల్లగొట్టి కోవలక్ష్మిమి ఓటమి పాలు చేయాలని ప్లాన్ చేసినప్పటికీ వారి పాచిక పనిచేయలేదు. ఆదివాసీ తెగలకు చెందిన 10 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా వేలాది ఓట్లు ఓట్లు చీల్చారు.