నిర్మల్ టౌన్, ఏప్రిల్ 2 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా 13 వేల మంది దివ్యాంగ పింఛన్దారులు ఉండగా.. ఇంకా అర్హులైన వారు దాదాపు 3 వేలకుపైగా ఉంటారు. ప్రభుత్వం వికలాంగులకు నెలకు రూ.3,016 సాయం అందిస్తుండగా.. అన్ని అర్హతలు ఉండి పింఛన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీరందరికీ సర్కారు సదరం క్యాంపులు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలి. ప్రధానంగా చెవిటి, మూగ, కుంటి, మానసిక స్థితి బాగా లేనివారికి ఏరియా దవాఖానల్లో శిబిరాలు నిర్వహిస్తారు. కాగా.. జిల్లాలోని 18 మండలాలతోపాటు నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల్లోని దివ్యాంగులకు నెలకు కేవలం 30 మందికి మత్రమే స్లాట్ బుకింగ్స్కు అనుమతి ఇస్తున్నారు. ఒక్కొక్క మండలంలో కనీసం 100-150 మంది వరకు దివ్యాంగులు ఉండగా.. వారికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం సరిపోక పెన్షన్కు అర్హత సాధించలేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో స్లాట్ బుకింగ్లకు మొత్తం78 మీసేవా కేంద్రాలు ఉండగా.. ప్రభుత్వం స్లాట్ అనుమతి ఇచ్చిన రోజు 50 నుంచి 100 మందికిపైగా దివ్యాంగులు వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
రెండు నిమిషాల్లోనే క్లోజ్
దివ్యాంగులు పింఛన్ పొందేందుకు, కాలపరిమితి ముగిసిన వారు కూడా తప్పకుండా సద రం శిబిరానికి హాజరుకావాలి. శిబిరాల నిర్వాహకులు స్లాట్ బుకింగ్కు అనుమతి ఇచ్చినపుడే మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధేశిత తేదీల్లోనే ప్రభుత్వం స్లాట్ బుకింగ్ వెబ్సైట్ను ఓపెన్ చేస్తుంది. ఓపెన్ కావడంతో నే కేంద్రాల వద్ద బాధితులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఎండనక, వాననక, చలనక కేంద్రాల వద్ద వేచి చూడాల్సి వస్తున్నది. ప్రతి గ్రామంలో కేంద్రాలు లేకపోవడంతో ఉన్న చోట్ల ఉదయం నుంచే క్యూలు కడుతున్నారు. స్లాట్ ఉదయం 11 గంటలకు ఓపెన్ కాగానే మీసేవా కేంద్రం నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతున్నది. చాలా మంది రావడంతో ఏమి చేయాలో తోచడం లేదని పేర్కొంటున్నా రు. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసేలోపే స్లాట్ పూర్తయినట్టు సిగ్నల్ రావడంతో బాధితులు వెనుదిరుగుతున్నారు. ఇలా కొందరికి ఎండ్లకేండ్లుగా స్లాబ్ బుకింగ్ దొరుకడం లేదని పేర్కొంటున్నారు. కండ్లు లేనివారు, నడవలేనివారు కేంద్రాలకు రావడానికి అవస్థలు పడుతున్నారు. శారీరకంగా ఇబ్బందితోపాటు ఆర్థికంగా కూడా అవస్థలు పడుతున్నారు. రవా ణా చార్జీలు కూడా భ రించలేక పోతున్నామని వాపోతున్నారు. స్లాట్ బుకింగ్ 30 మందికే ఇవ్వడంతో దివ్యాంగులపై సర్కారుకు ఉన్న ప్రేమ అర్థమవుతున్నదని పేర్కొంటున్నారు. స్లాట్స్ సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.
పెన్షన్ ఆగింది..
నా పేరు భూమవ్వ. మాది లోకేశ్వరం మండలంలోని ఎడ్దూర్ గ్రామం. నేను దివ్యాగురాలును. పదేండ్ల నుంచి పెన్షన్ తీసుకుంటున్నా. ప్రతినెలా రూ.3,016 వచ్చేవి. నాకు సదరం క్యాంపులో ఇచ్చిన దివ్యాంగుల పత్రం కాలపరిమితి నాలుగు నెలల క్రితమే ముగిసింది. దీంతో పెన్షన్ను ప్రభుత్వం నిలిపి వేసింది. అప్పటి నుంచి రెన్యూవల్ చేసుకోవడానికి మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా. రవాణా ఖర్చులు మీద పడుతున్నవే తప్పా స్లాట్ బుక్ కావడం లేదు. నా వయసు 75 ఏండ్లు. ఈ వయసులో తిరగడం కష్టంగా ఉంది.
స్లాట్స్ను పెంచాలి..
దివ్యాంగులకు స్లాట్స్ సంఖ్యను పెంచాలని అధికారులకు విన్నవించినం. ప్రతినెలా అన్ని రకాల దివ్యాంగులకు 50 మించి స్లాట్స్ ఇవ్వకపోవ డంతో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నరు. అర్హులైన వారికి పెన్షన్లు రాక మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగడం వల్ల ఖర్చులు పెరిగి ఇటు పెన్షన్ రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్స్ సంఖ్యను ప్రతి మీసేవకు కనీసం 50 ఇవ్వాలి. ప్రభుత్వ అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
– ఇసాక్, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు, నిర్మల్.
వైద్యులకు నివేదించాం..
ప్రతినెలా సదరం శిబిరా ల కోసం స్లాట్స్ బుకింగ్స్ చేస్తున్నాం. ఆన్లైన్ కావడంతో కొందరికి మాత్రమే స్లాట్ దొరుకుతున్నది. స్లాట్స్ పెంచాలని ప్రభుత్వానికి, వైద్యులకు నివేదిక ఇచ్చినం. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న వెంటనే వైద్యులతో పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి కొత్త పెన్షన్, పాత వారికి రెన్యూవల్ చేస్తున్నాం.
– విజయలక్ష్మి, జిల్లా అధికారి.