దండేపల్లి, ఏప్రిల్11 : గూడెం ఎత్తిపోతల పథకం నుంచి నీటి సరఫరా నిలిపివేయగా, ఆలస్యంగా వరి సాగు చేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొంది. యాసంగిలో గూడెం ఎత్తిపోతల నుంచి సుమారు 15,600 ఎకరాలకు సాగు నీరందించాలని అధికారులు నిర్ణయించారు. ఆయకట్టు పరిధిలోని డీ-30 నుంచి డీ-42 (కాలువలు) వరకు జనవరి 6వ తేదీ నుంచి నిరంతరాయంగా నీరు సరఫరా చేశారు. గోదావరిలో నీరు తగ్గడంతో ఈ నెల 3న నీటి సరఫరా నిలిపివేశారు. వరి గొలక దశలో ఉందని, పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నెల 7,8,9 తేదీల వరకు నీటిని అందించి.. ఆ తర్వాత ఆపేశారు.
అనుకున్న సమయంలో సాగు చేసిన రైతులకు కొన్ని చోట్ల పంట కోతకు వచ్చింది. మరి కొన్ని చోట్ల కోతలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే, ఆలస్యంగా సాగు చేసిన వరి గొలక దశలో ఉంది. వీటికి ఒకటీ& రెండు తడులు అవసరముంది. లిఫ్ట్ నీటిని నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నీరు సరఫరా చేయాలని వేడుకుంటున్నారు.
రాష్ట్రంలో ఎండలు మండిపోతుండడంతో సాగు నీటి కంటే.. తాగునీటికి ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. గూడెం ఎత్తిపోతల ద్వారా అనుకున్న దానికంటే ఎక్కువే సాగునీటిని అందించడం జరిగిందని అధికారులు అంటున్నారు. ఎల్లంపెల్లి బ్యాక్ వాటర్ నుంచి గూడెం ఎత్తిపోతల ద్వారా జనవరి 6 నుంచి మార్చి 31 వరకు 1.5 టీఎంసీల నీరు మాత్రమే అందించాలని అధికారులు నిర్ణయించారు. కానీ అనుకున్నదానికంటే ఎక్కువే నీటిని అందించామని వారు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే నీటిని నిలిపేశామని వారు పేర్కొంటున్నారు.