కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులను ప్రకటించగా.. ప్రజాక్షేత్రంలో ముమ్మరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా సవరణ, ఇతర సామగ్రి, ఈవీఎంలు, ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగించనుంది. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా.. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో గ్రామాల బాట పట్టారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఇంటింటికీ తిరుగుతున్నారు. కుల, ఇతర సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తుండడంతో ఎన్నికల వేడి మొదలైందనే చర్చ జరుగుతోంది.
సర్వం సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం
జిల్లాలో ఆసిఫాబాద్, సిర్పూర్(టీ) అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా యి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పది మండలాలు, సిర్పూర్(టీ) నియోజకర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పది మండలాల్లో పోలింగ్ కేంద్రాలు 301 ఉండగా.. 2,01,313 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,00,721 మంది, స్త్రీలు 1,00,581 మంది ఇతరులు 11 మంది ఉన్నారు.సిర్పూర్(టీ) నియోజకవర్గంలో 2,05,630 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 1,03,736 మంది, స్త్రీలు 1,01,886 మంది, ఇతరులు ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 283 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నిక లు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు అధికార యంత్రాం గం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారవుతుండగా.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈవీఎంలను కూడా సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. అభ్యర్థులు కార్యక్రమాలను వేగవంతం చేశారు.
సెప్టెంబర్ 19 వరకు సవరణ
స్పష్టమైన ఓటర్ల జాబితాను తయారు చేయడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవ్రావు రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ తప్పులు లేకుండా ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని చూస్తున్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితా సవరణకు సెప్టెంబర్ 19వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అవసరాన్ని బట్టి పోలింగ్ కేంద్రాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. ఓటర్ల జాబితాల సవరణలో రాజకీయ పార్టీల సహకారాన్ని తీసుకుంటున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల నాటికి స్పష్టమైన ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు పోలింగ్ బూత్ స్థాయి మొదలుకొని జిల్లాస్థాయి అధికారుల వరకు కసరత్తు చేస్తున్నారు. ఒక గ్రామానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా జాబితాలు రూపొందిస్తున్నారు.