దిలావర్పూర్/లక్ష్మాణచాంద/సారంగాపూర్, అక్టోబర్ 4 : ‘ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మి ఆగం కావద్దు.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని మరువద్దు..’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ప్రజలకు సూచించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి సమీపంలోని శ్రీరాంసాగర్ బ్యాక్వాటర్తో రూ.714 కోట్లతో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్యాకేజీ ప్యాకేజీ-27 (శ్రీ లక్ష్మీ నరసింహస్వామి) ఎత్తిపోతల పథకాన్ని బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, నాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్లో గుండంపల్లికి చేరుకున్న మంత్రి కేటీఆర్కు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలా చారీ ఘన స్వాగతం పలికారు. అనంతరం గుండంపెల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడి నుంచి ప్యాకేజీ-27 పంపుహౌస్కు చేరుకున్నారు. సంబంధిత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పక్కనే ఉన్న పంపహౌస్ బటన్నొక్కి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా దిలావర్పూర్ సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ సిస్టర్న్ వద్దకు చేరుకున్నారు. గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. తమ గ్రామానికి వచ్చిన మంత్రి కేటీఆర్ను చూసి ఉప్పింగిపోయిన గుండంపల్లి రైతులు, మంత్రులు కేటీఆర్, అల్లలోను భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 55 ఏండ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వండని అడగడం సిగ్గుచేటన్నారు. ఆరు పథకాలతో మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని, ఓటర్లు వారి మోసాన్ని పసిగట్టాలని పేర్కొన్నారు. తల్లికి అన్నం పెట్టనివాడు, పినతల్లికి బం గారు గాజులు చేయిస్తామన్న చందంగా ఆ పార్టీ మాటలు ఉన్నాయన్నారు. వారి మోసాలను తె లంగాణ ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 15 నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తిచేశారని స్ప ష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటు కాకముందు ఎవరూ పట్టించుకోలేదన్నారు. నేడు ప్రాజెక్టులు నీటితో పరుగులు పెడుతున్నాయని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు ప్రారంభించి వదిలేసిన ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ పూర్తిచేశారన్నారు. ఇటీవల చనాక కొరాట ప్రాజెక్టు ట్రయల్ రన్ పూర్తయ్యిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆదిలాబాద్ జిల్లాలో రూ.5వేల నుంచి రూ.10 వేలు ఉన్న ఎకరం ధర నేడు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెరగడానికి కార ణం తాము చేసిన అభివృద్ధేనని స్పష్టం చేశారు. అలాగే సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వేసవిలో పల్లెలకు వెళ్లాలంటే అక్కడి మహిళలు ఖాళీ బిందెలు, కుండల తో అడ్డుకుంటారన్న భయం ఉండేదన్నారు. కానీ, ప్రత్యేక రాష్ట్రంలో మిషన్ భగీరథతో ప్రతీ తండా, గూడేనికి తాగునీరు అందుతున్నదని, ఆడబిడ్డ కండ్లల్లో ఆనందం నింపిన ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. అలాగే సాగు ప్రారంభానికి ముందుగానే రైతుల ఖాతాలో రైతు బంధు జమ అవుతున్నదని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటివరకు 70 లక్షల మంది ఖాతాల్లో రూ.73 కోట్లు జమచేసిందని వివరించారు. 13 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ పథకం కింద ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబానికి అండగా నిలిచామన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోనే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసామని తెలిపారు. ముథోల్ నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన ఏర్పాటుచేసి, అందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజ నం అందిస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యా ప్తంగా 1001 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభించి, 6.50 లక్షల విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, రుచికరమైన భో జనం, ఉచిత దుస్తులు, పుస్తకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలను ప్రభుత్వం ఖర్చుచేస్తున్నదన్నారు.
తాము చేసిన పనులు చెప్పుకుంటూ ప్రజల వద్దకు వెళ్తుంటే రైతులకు 24 గంటల కరెంటు ఎక్కడ ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమట్రెడ్డి వెంకట్రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీ పార్టీ నాయకులను మీరు చెప్పిన సమయానికి, మీరు చెప్పిన చోటుకే తీసుకొని వెళ్దాం. అక్కడ కరెంటు తీగలను పట్టుకొని చూస్తే తెలుస్తది 24 గంటల కరెంటు వస్తుందో లేదో. అప్పుడు మీరు, మీ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంకండి.. అని మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. నాడు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే మోటర్ల వద్ద స్నానం చేసేందుకు కరెంట్ కోసం అధికారులను బతిమిలాడే రోజలుండేవని గుర్తుచేశారు.
ఇప్పుడు అలాంటి తిప్పలున్నాయా అని ప్రజలను నేరుగా అడిగారు. దేశంలో ఎక్కడాలేనివిదంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వాన్ని, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని, ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డితో పాటు, ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ఆశీర్వదించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంగీత, నిర్మల్ జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థులు రాథోడ్ జాన్సన్ నాయక్, అనీల్ జాదవ్, ఎంపీపీ పాల్దె అక్షర, జడ్పీటీసీ రమణారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కొమ్ముల చిన్న దేవేందర్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, నాయకులు పాల్దె అనీల్, ఏలాల చిన్నారెడ్డి, ఏలాల అమృత, కొమ్ముల సవిత, గంగారెడ్డి, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశృతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.