చిత్రంలో కనిపిస్తున్న భవనం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని పశువైద్యశాల భవనం. దీనిని దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించారు. ఈ భవనం కూలడానికి సిద్ధంగా ఉన్నది. వర్షానికి గదులు ఊరుస్తున్నాయి. కూలకుండా స్లాబుకు కర్రలు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళా సిబ్బంది అవస్థలు పడుతున్నారు. పశువులను కట్టేయడానికి షెడ్డు కూడా లేదు. వర్షాలకు రికార్డులు, బిర్వాలు, ఫ్రిజ్, మందులు తడిసిపోతున్నాయి.
ఉట్నూర్ రూరల్, జూలై 19 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన పశు దవాఖాన.. ఉట్నూర్, బోథ్ మండల కేంద్రాలలో రెండు ప్రధాన ఏరియా దవాఖానలు.. ఇతర మండలాలలో 22 ప్రైమరీ దవాఖానలు ఉన్నాయి. ఇందులో రెండు ఏరియా, 21 ప్రైమరీ దవాఖానలు శిథిలావస్థ లో ఉన్నాయి. ఇప్పటికే కౌటా, సోనాల, తర్నం, సుంకిడి, కరంజి, సాంగిడిలో ఉన్న ఆరు దవాఖానలు పూర్తిగా శిథిలావస్థలో ఉండగా.. గ్రామ పంచాయతీ, ఇతర కార్యాలయాలలో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3.48 లక్షల గేదెలు, ఆవులు.. 3.32 లక్షల గొర్రెలు, మేకలు.. 5 లక్షలకుపైగా కోళ్లు, ఇతర జంతువులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఐదు వేల పశువుల సంఖ్యకు ఒక డాక్టర్ ఉండాలి. సిబ్బంది కొరతతో పశువులకు సరైన సమయంలో చికిత్స అందడం లేదు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
ప్రభుత్వ నిబంధన ప్రకారం ఐదు వేల పశువుల సంఖ్యకు ఒక డాక్టర్ ఉండాలి. కానీ.. ఖాళీ పోస్టులు భర్తీ చేయక ఇన్చార్జిలతో కాలం వెళ్లదీస్తున్నారు. 22 ప్రైమరీ దవాఖానలలో 14 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉట్నూర్, బోథ్ మండల కేంద్రాలలో పశు సహాయ సంచాలకుల పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్ 32 పోస్టులకు 12 ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు అంటెండర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాలపై జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రామారావు రాథోడ్ను అడుగగా.. శిథిలావస్థలు ఉన్న భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిచాలని కలెక్టర్, ప్రభుత్వానికి నివేదికలు పంపాం. వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా చూస్తాం అని తెలిపారు.
సకాలంలో వైద్యం అందించాలి
తాము పెంచుకుంటున్న పశువులకు సకాలంలో వైద్యం అందించాలి. ఉట్నూర్లో వైద్యులు సరిగా ఉండడం లేదు. చాలా సందర్భాల లో తాళం వేసి ఉంటుంది. నాతోపాటు రైతులు పశువులను తీసుకొచ్చి తిరిగి వెళ్తున్నారు. ప్రభుత్వ వైద్యం అందక ఇతర ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తున్నది. అధికారులు అందుబాటులో ఉంటూ వైద్యం అందించాలి.
– జక్కుల ఇందయ్య, రైతు, ఉట్నూర్.
సదుపాయాలు కల్పించాలి
ఉట్నూర్ మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో సదుపాయాలు లేవు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దవాఖానలోని షెడ్డు కూలీ పోయింది. కొత్త షెడ్డు నిర్మించాలి. మందుల కొరత లేకుండా చూడాలి. కొన్ని సందర్భాలలో ప్రైవేటు మెడికల్ మందులు కొనాల్సి వస్తుంది. అధికారులు పశువులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచాలి.
– సాడిగే రాజేశ్వర్, రైతు, ఉట్నూర్.