వరి సాగులో యేటేటా ఎరువులు, విత్తనాల ధరలతో పాటు యంత్రాల వినియోగపు ఖర్చులు పెరిగిపోతుండగా, వ్యవసాయశాఖ ‘వెదవరి’ విధానంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు జిల్లాలోఈ యాసంగిలో 684 ఎకరాల్లో వేసేలా ప్రణాళికలు రూపొందించింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే వీలుండగా, రైతులకు అవగాహన కల్పించి ఆ వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నది. మరోవైపు రసాయన మందులు విపరీతంగా వినియోగిస్తుండగా, ప్రయోగాత్మకంగా 7000 ఎకరాల్లో జీవన ఎరువు, 1874 ఎకరాల్లో పచ్చిరొట్ట ఎరువు ద్వారా ఎవుసం చేసేందుకు సన్నద్ధమవుతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయంలో యేటేటా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎరువులు, విత్తనాల ధరతో పాటు కూలీలు, యంత్రాల వినియోగపు ఖర్చులు పెరుగుతున్నా యి. యేటా ఎకరం వరి సాగుకు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు ఖర్చు చేయా ల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అధికశ్రమతో కూడిన దమ్ము చేసి నాట్లు వేసే పద్ధతికి ప్రత్యామ్నాయంగా వెదజల్లే విధానం వైపు రైతులను మళ్లించేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తున్నది. ఈ విధానంతో పెట్టుబడి, శ్రమ ఎలా తగ్గుతుందో వివరించేందుకు ప్రయోగాలను చేయనున్నది.
విత్తే పద్ధతి ఇలా..
అన్ని పద్ధతులకన్నా అతి సులువైన పద్ధతి వెదజల్లే పద్ధతి. నేలను దమ్ము చేసి గొర్రుతో చదు ను చేసుకున్న వెంటనే బురదలో విత్తనాన్ని చల్లుకోకూడదు. బురదలో కూరుకుపోయిన విత్తనం సరిగా మొలకెత్తదు. అందుకే దమ్ము, గొర్రుతో చదును చేసిన పిదప మడిలో కొంతమేర నీరు ఉంచాలి. ఆ తర్వాత నానబెట్టిన వరి (మొలకలు వచ్చిన) విత్తనాలను పొలమంతా సరిసమానంగా వెదజల్లుకోవాలి. దీం తో 15 నుంచి 20 శాతం విత్తనాలు వృథా కావు. నాటు వేసే పద్ధతితో 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి
ఈ వెదజల్లే విధానం ద్వారా పంట ఏపుగా పెరగడంతో పాటు దిగుబడి కూడా బాగుంటుం ది. నారుపోసే అవసరముండదు. సంప్రదా య పద్ధతిలో ఎకరాకు 25 కిలోల విత్తనాలు వాడితే.. ఈ విధానంలో ఎకరానికి 15 కిలోల విత్తనాలు అవరసమవుతాయి. ఈ పద్ధతితో సమయం కలిసి వస్తుంది. పైగా కూలీల ఖర్చు మిగులుతుంది. ఈ విధానంలో తెగుళ్ల సమస్య కూడా అంతగా ఉండదు. పంటకాలం తక్కు వ. నాటు వేసే అవసరముండదు. వెదజల్లే పద్ధతి ద్వారా ఎకరాకు సుమారు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఈ యాసంగిలో 684 ఎకరాల్లో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి తర్వాత అత్యధికంగా సాగయ్యేది వరి. ఈ యాసంగిలో 58,776 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో 389 మందికి చెందిన వ్యవసాయ క్షేత్రాల్లో 684 ఎకరాల్లో వెద వరి సాగు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విధానంతో కలిగే లాభాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
జీవన, పచ్చి రొట్ట ఎరువులు వినియోగించేలా…
రైతులు అధిక దిగుబడులపై ఆశతో రసాయన ఎరువులను విపరీతంగా వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఎరువుల ఖర్చులు అధికం కావడమే తప్ప.. పంటలకు ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో రైతులు రసాయన ఎరువులకు బదులుగా జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులను వినియోగించే విధంగా ప్రోత్సహించేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ప్రయోగాత్మకంగా జిల్లాలోని 3500 మంది రైతులకు చెందిన 7000 ఎకరాల్లో జీవన ఎరువు, 849 రైతులకు చెందిన 1874 ఎకరాల్లో పచ్చిరొట్ట ఎరువుల ద్వారా వ్యవసాయాన్ని చేసేలా ప్రణాళికలు రూపొందించారు. వచ్చే యాసంగి, వర్షాకాలపు పంటల్లో ఈ విధానాలను అమలు చేయనున్నారు.