ఉట్నూర్, మే26: వైద్యం,సౌకర్యాల కల్పనలో భాగంగా నిర్వహించిన ముస్కాన్ ర్యాంకింగ్స్లో ఉట్నూర్ జిల్లా దవాఖాన రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. అయితే దేశంలోని గిరిజన దవాఖానల్లో కూడా ఉట్నూర్ జిల్లా ఆసుపత్రే మొదటిస్థానంలో నిలవడం గమనార్హం. ఏడు విభాగాల వారీగా కేంద్ర ప్రభుత్వ ముస్కాన్ టీం ఈ తనిఖీలు నిర్వహించగా, ఉట్నూర్ జిల్లా దవాఖాన 94 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్ సాధించింది. దీంతో పాటు ఎంసీహెచ్ జనగాం 89, జిల్లా దవాఖాన నల్గోండ 84, రిమ్స్ మెడికల్ కళాశాల 81 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత నెల ఏప్రిల్ 19, 20 తేదీల్లో కేంద్ర బృందం, ముస్కాన్ టీం ఇక్కడ పర్యటించారు. ఇందులో భాగంగా ఎస్ఎన్సీయూ, ఎన్ఎస్సీయూ, పీడియాట్రిక్, వార్డుల విభాగాల్లో ప్రజలకు అందుతున్న వైద్యం, ఆసుపత్రి సౌకర్యాలు, నిర్వహణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలలో వీటికి ర్యాంకింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉట్నూర్ సామాజిక దవాఖానను జిల్లా దవాఖానగా ఏర్పాటు చేసి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆదిలాబాద్ రిమ్స్ వైద్యశాలను కూడా ఈ నెల 3, 4 తేదీల్లో ముస్కాన్ బృందం తనిఖీ చేసింది.ముస్కాన్ అవార్డుతో లాభం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ముస్కాన్ ర్యాంక్లతో జిల్లా దవాఖానలకు అదనపు లబ్ధి చేకూరనున్నది. ర్యాంకులు సాధించిన దవాఖానలకు ఏడాదికి రూ. 12 లక్షల చొప్పున మూడేండ్లకు రూ. 36 లక్షలు రానున్నాయి.
ర్యాంకు రావడం సంతోషంగా ఉంది
గిరిజన ప్రాంతంలోని ఉట్నూర్ జిల్లా దవాఖానకు మొదటి ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి సహకారం, చర్యలతోనే ఈ ఘనత సాధించాం. ఇటీవల సీహెచ్సీగా ఉన్న దవాఖానను జిల్లా దవాఖానగా ప్రభుత్వం ఆప్గ్రేడ్ చేసింది. అలాగే డయాలసిస్, బ్లడ్ బ్యాంక్ సౌకర్యం కల్పించడంతో ఇక్కడి ప్రజలకు మేలు కలిగింది. ఐటీడీఏ కేంద్రం కావడంతో ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు సైతం వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. మా శ్రమకు తగ్గ విజయం ఇది.
-ఉపేందర్, ఉట్నూర్ దవాఖాన సూపరింటెండెంట్