మంచిర్యాల అర్బన్, జనవరి 29 : చెన్నూర్ వ్యవసాయ డివిజన్లో యూరియా అలాట్మెంట్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కాసులకు కక్కుర్తి పడి.. డీలర్లకు ఇష్టం వచ్చినట్లు యూరియా కేటాయిస్తుండగా, వారు తమ వద్ద నిల్వ చేసుకొని.. ఆపై అక్రమ దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్రకు తరలిస్తూ అందినకాడికి దండుకుంటుండగా, అధికారులు ‘మాములు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఒక డీలర్ తనకు యూరియా కావాలని మండల వ్యవసాయాధికారికి సమాచారమిస్తే.. ఆ దుకాణంలో ఉన్న యూరియా.. ఆధారంగా ఇండెంట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మండల వ్యవసాయాధికారి యూరియా ఇండెంట్ పెట్టినా.. అది ఏడీఏ స్థాయిలో ఆగడం.. ఒకవేళ అక్కడి నుంచి డీఏవో కార్యాలయానికి ఇండెంట్ పెట్టినా అదే పరిస్థితి ఉంటుందని పలువురు చెబుతున్నారు.
మండల స్థాయి నుంచి డీఏవో కార్యాలయ సిబ్బంది వరకు చేతి తడిపితేనే పని చేసి పెడుతారట. డీఏవో కార్యాలయంలోని టెక్నికల్ ఏవో, సెక్షన్ అధికారితో పాటు మరికొందరికి ముడుపులు ఇవ్వనిదే అలాట్మెంట్ కాదట. 10 టన్నుల యూరియా కేటాయింపునకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేల దాకా వసూలు చేస్తున్నారని పలువురు చెప్పడం గమనార్హం. ఈ విషయంపై డీలర్లు ఎంతెంత సమర్పించుకున్నారో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే అసలు విషయం బయటపడనున్నది.
డీలర్ల నుంచి అధికారులు ముడుపుల రూపంలో దండుకుంటుంటే.. సదరు డీలర్లు ఈ మొత్తాన్ని రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక యూరియా బస్తాకు రూ. 253కు సొసైటీలకు వస్తుంది. ప్రైవేటు డీలర్లకైతే అదనంగా ట్రాన్స్ఫోర్టేషన్, హమాలీ రూపంలో బస్తాకు రూ. 20 నుంచి రూ. 30 పడుతుంది. కానీ మార్కెట్లో ఒక్కో యూరియా బస్తాకు రైతుల వద్ద నుంచి రూ. 330 నుంచి రూ. 350 వసూలు చేస్తున్నారు.
ఇంత ఎందుకంటే ఒక లోడు యూరియా రావాలంటే కింది నుంచి మీది వరకు డబ్బులివ్వాల్సి వస్తుందని, డబ్బులివ్వకుంటే ఇండెంట్ పెట్టినా అలాట్మెంటు ఇవ్వరని నేరుగా పేరు చెప్పేందుకు ఇష్టపడని పలువురు డీలర్లు చెబుతున్నారు. మహారాష్ట్ర బార్డర్ డివిజన్ కావడంతో హాకా, ఆగ్రోస్, డీసీఎంఎస్ సొసైటీల్లో కూడా అధిక ధరకు విక్రయిస్తున్నారు. రైతులను అడిగితే ఈ వివరాలన్నీ బయటపడే అవకాశమున్నది.
చెన్నూర్ మండల కేంద్రం ఆది నుంచి కమర్షియల్ పాయింటే. ఇటు వ్యాపారానికి, నకిలీ విత్తనాలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర యూరియా సైతం టన్నుల కొద్దీ మహారాష్ట్రకు తరలుతుంది. సంబంధిత శాఖ అధికారుల అండదండలతోనే ఈ దందా నడుస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ఇద్దరు ఏఈవోల అండదండలతో చెన్నూర్ మండల కేంద్రం నుంచి యూరియా లోడ్ మహారాష్ట్రకు తరలింది. ఇది ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. కొందరు హోల్సేల్ డీలర్లు డమ్మీ ఇన్వాయిస్ల పేరిట యూరియాను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
బావురావుపేటలో హాకా పేరిట ఒక ఫర్టిలైజర్ దుకాణానికి లైసెన్సు తీసుకున్న డీలర్కు చెన్నూర్ సమీపంలో ఒక ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణం కూడా ఉంది. హాకా సొసైటీ పేరిట యూరియా అలాట్మెంటు తీసుకొని.. దానిని తన ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసి వ్యాపారం సాగిస్తున్నాడు. ఇలా లోడ్లకు లోడ్లు హోల్సేల్ వ్యాపారులతో కుమ్మక్కై జోరుగా జీరో దందా సాగిస్తున్నాడు. చెన్నూర్ డివిజన్లోని కోటపల్లి, చెన్నూర్ మండలాలకు గతేడాది, ఈ ఏడాది వానకాలంలో యూరియా అలాట్మెంట్లు పరిశీలిస్తే అసలు విషయం బయటపడనున్నది.
2022-23 వాన కాలం సీజన్లో హాకా ఎఫ్ఎస్సీ చెన్నూర్కు 220 మెట్రిక్ టన్నులు, బావురావుపేటకు 60 మెట్రిక్ టన్నులు, కోటపల్లి మండలం హాకా సర్వాయిపేటకు 280 మెట్రిక్ టన్నులు పంపించారు. యాసంగిలో హాకా ఎఫ్ఎస్సీ చెన్నూర్కు 300 మెట్రిక్ టన్నులు, బావురావుపేటకు 40 మెట్రిక్ టన్నులు, కోటపల్లి మండలం హాకా సర్వాయిపేటకు 220 మెట్రిక్ టన్నులు పంపించారు. 2023-24 వానకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బావురావుపేటలోని హాకా దుకాణానికే సుమారు 200 మెట్రిక్ టన్నులకుపైనా యూరియా అలాట్ చేశారు. చెన్నూర్ డివిజన్లో ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. కానీ మిగితా ఎఫ్ఎస్సీలకు తక్కువ మొత్తంలో అలాట్ చేయడంపై అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.
సొసైటీలకు యూరియా అలాట్మెంట్ అనేది ఏరియా వారీగా సీజన్కు ముందుగానే ప్రణాళిక తయారు చేసి మండలాధికారులు జిల్లా అధికారులకు సమాచారం అందిస్తారు. సదరు అధికారులు ఆయా మండలాల అవసరాన్ని బట్టి కేటాయించాలి. కానీ అలా జరుగడం లేదు ఎవరు డబ్బులిస్తే వారికి.. ఎంత కావాలంటే అంత ఇవ్వడం జరుగుతుంది. గతేడాది వానకాలం, యాసంగి, ఈ ఏడాది వానకాలం డీఏవో కార్యాలయ అధికారులు ఇచ్చిన అలాట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. జిల్లా అధికారి కార్యాలయంలోని ఉన్నతాధికారితోపాటు యూరియా కేటాయింపులు చేసే టెక్నికల్ వ్యవసాయాధికారి, సదరు సెక్షన్ అధికారుల చేతివాటంతోనే ఇదంతా నడుస్తున్నట్లు సమాచారం.