సారంగాపూర్, జూలై 25 ;పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల స్కూల్ గేమ్స్కు మోక్షం లభించింది. కొవిడ్ మూలంగా మూడేళ్లుగా ఆటలు లేక నిరాశతో ఉన్న క్రీడాకారుల్లో ఈ ఏడాది కొత్త ఉత్సాహం నిండింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేయగా, అందుకు తగ్గట్టుగా ఎస్జీఎఫ్ కార్యాచరణ రూపొందిస్తున్నది. ఆగస్టులో పోటీలు ప్రారంభమవనుడంగా, నిర్మల్ జిల్లాలో 357 పాఠశాలలకు ప్రయోజనం కలుగనున్నది. కాగా, విద్యార్థుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
విద్యార్థులు ఆటల్లో రాణించాలంటే సరైన ప్రోత్సాహం ఉండాలి. అప్పుడే మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగి ప్రతిభ చూపేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకు ప్రభుత్వం యేటా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీలను నిర్వహిస్తున్నది. కొవిడ్ కాణంగా మూడేళ్లుగా ఈ క్రీడలను నిర్వహించడంలేదు. దీని వల్ల పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీలకు క్రీడాకారులు దూరమయ్యారు. ఈ ఏడాది పోటీలను నిర్వహించేందుకు విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. యేటా ఆగస్టు నుంచి నవంబర్ నెలల్లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాపోటీలను నిర్వహిస్తుంటారు. ఇందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ప్రభుత్వ ఖర్చులతోనే…
కొవిడ్ వల్ల ఎస్జీఎఫ్ క్రీడలను ప్రభుత్వాలు నిర్వహించలేదు. గత విద్యా సంవత్సరంలో అయినా పోటీలు జరుగుతాయని భావించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి స్పం దన లేదు. రెండేళ్ల నుంచి కేవలం అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ సొంత ఖర్చులతో వివిధ చోట్లకు వెళ్లాల్సి వస్తున్నది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. దీంతో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు వెళ్లడం లేదు. అదే ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగే పోటీలకు క్రీడాకారుల ఖర్చులు మొత్తం ప్రభుత్వాలే భరిస్తాయి.
జిల్లాలో ప్రతిభ…
నిర్మల్ జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ 117 జడ్పీ, 18 కేజీబీవీలు, 13 ఆశ్రమ, 5 మైనార్టీ, 4 సోషల్వెల్ఫేర్, 1 మాడల్ స్కూల్, సుమారు 200 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలోని విద్యార్థులను ప్రోత్సహిస్తే రాణించే క్రీడాకారులు చాలా మంది ఉంటారు. అండర్-14, 17,19 విభాగాల్లో ఆటల పోటీలు జరుగుతుంటాయి. నిర్మల్ జిల్లా నుంచి వివిధ క్రీడాంశాల్లో 2019-20లో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఆటల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు క్రీడా కోటాలో ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందే అవకాశం ఉంది.
సెప్టెంబర్లో రాష్ట్రస్థాయి…
2023, ఆగస్టు మొదటి, రెండో వారం వరకు మండల స్థాయిలో క్రీడాపోటీలు పూర్తిచేయాలి. జోనల్స్థాయిలో ఆగస్టు మూడోవారంలో, సెప్టెంబర్ రెండో వారంలో ఉమ్మడి ఆదిలాబాద్ స్థాయిలో పూర్తి చేయాలి. సెప్టెంబర్ నాలుగో వారంలో రాష్ట్రస్థాయిలో పూర్తి చేసి, జాతీయ స్థాయి పోటీలకు పంపించాలి. ఆటల పోటీలకు కావాల్సిన నిధులను ప్రభుత్వమే మంజూరు చేస్తున్నది. మంజూరైన నిధులు ఎస్ఎంసీ తీర్మానం చేసిన తర్వాతనే తీసుకోవాల్సి ఉంటుంది.
క్రీడాకారులకు ఉపయోగకరం..
క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్జీఎఫ్ పోటీలను నిర్వహిస్తున్నది. ఈ పోటీలు క్రీడాకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆగస్టులో మండల, జిల్లా, జోన్ స్థాయి, సెప్టెంబర్లో జాతీయస్థాయి పోటీలుంటాయి. ఆటల పోటీల నేషనల్ క్యాలెండర్ వచ్చిన వెంటనే కమిటీ నిర్వహించి పోటీలు నిర్వహిస్తాం. అండర్-14, 17 పోటీల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొంటారు. పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటరమణారావు, సెక్రటరీ, ఎస్జీఎఫ్, నిర్మల్ జిల్లా
క్రీడల్లోనూ రాణించే అవకాశం..
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేందుకు ఇది మంచి అవకాశం. చాలా రోజులుగా ఈ క్రీడా పోటీలు నిర్వహించలేదు. ఇప్పుడు నిర్వహిస్తారని మా టీచర్లు చెప్పారు. ఈ పోటీలను సద్వినియోగం చేసుకుంటే ఉన్నత చదువులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడాస్థిరపడొచ్చని చెప్తున్నారు. అండర్-14, 17 విభాగాల్లో మేము పోటీ పడుతాం. ఇప్పటి నుంచే నిత్యం సాధన చేస్తాం. వచ్చే నెలలో పోటీలు నిర్వహిస్తారని టీచర్లు అంటున్నారు.
– సాయిప్రసన్న, 9వ తరగతి, సారంగాపూర్ ఉన్నత పాఠశాల
ఉన్నత స్థాయికి చేరుకునేందుకు..
ప్రభుత్వం సర్కారు బడిలో నాణ్యమైన విద్య అందిస్తున్నది. దీంతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహిస్తున్నది. వచ్చే నెలలోనే అండర్-14, 17 విభాగాల్లో ఎస్జీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నారు. మా స్కూల్ తరఫున ఈ పోటీల్లో మేము కూడా పోటీ పడ్తాం. రూపాయి ఖర్చు లేకుండా పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. కరోనా కారణంగా మూడేండ్ల నుంచి ఈ పోటీలు నిర్వహించలేదు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేందుకు మంచి అవకాశం.
– రాథోడ్ గోపాల్, 10వ తరగతి, సారంగాపూర్ ఉన్నత పాఠశాల