రైతు వ్యతిరేక బీజేపీ సర్కారు తీరుపై టీఆర్ఎస్ ఆందోళనలు..
ధాన్యం కొనుగోలులో కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నాలు..
పురవీధుల గుండా భారీ ర్యాలీలు.. దిష్టిబొమ్మల దహనం..
పాల్గొననున్న మంత్రి, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ శ్రేణులు
నేడు ఊరూరా ఊరేగింపులు, చావుడప్పు నిరసన కార్యక్రమాలు
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 19 : గులాబీ పార్టీ మరోమారు పోరుబాట పట్టనున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కమలం పార్టీ వైఖరిని రైతులు, ప్రజలకు తెలిపేందుకు చావుడప్పు నిర్వహించనున్నది. పార్లమెంట్ సాక్షిగా ఆడిన పచ్చి అబద్ధాలను రైతాంగానికి వివరించనుండగా.. పల్లెలు, పట్టణాల్లో భారీ ర్యాలీలు, ఊరేగింపులు, దిష్టిబొమ్మల దహనాల వంటివి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొననున్నారు.
రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై నేడు(సోమవారం) టీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టనున్నది. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించడంతో కేంద్రం దిగివచ్చి రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీజీపీ వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఊరూరా చావు డప్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా కమలం పార్టీ రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నది.., ఆ పార్టీ నిజస్వరూపాన్ని తెలిపేందుకు కార్యక్రమాలు రూపొందించారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో ప్రజలు, రైతులు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకొస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వర కు కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననుండగా.. పల్లెల్లో టీఆర్ఎస్ శ్రేణులు ఊరేగింపులు నిర్వహించనున్నాయి. ఇంకా కేంద్ర ప్రభు త్వ దిష్టిబొమ్మలు దహనం చేయనున్నారు.
పాల్గొననున్న మంత్రి అల్లోల..
బీజేపీ పార్టీపై రాష్ట్ర వ్యాప్త నిరసనలో భా గంగా నిర్మల్ పట్టణంలో చేపట్టనున్న కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పాల్గొనున్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. అలాగే.. చావుడప్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము ప్రకటనలో తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, రైతులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.