తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్డి ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన గిరిజనోత్సవం ఊరూరా కనుల పండువగా సాగింది. అడవిబిడ్డలు ఆటాపాటలతో సందడి చేస్తూ ర్యాలీలు తీశారు. కుమ్రం భీం విగ్రహాలకు నివాళులర్పించి.. జై భీం నినాదాలతో హోరెత్తించారు. ఆరాధ్య దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా చోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు పాల్గొని సంక్షేమ పథకాల గురించి వివరించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ చేశారు. గిరిజన పెద్దలను సన్మానించారు. ఉట్నూర్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి ఐకేరెడ్డి స్టాళ్లను పరిశీలించారు. మార్లవాయిలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు.
ఉట్నూర్, జూన్17 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనోత్సవం కనుల పండువగా సాగింది. ఉట్నూర్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావ్, ఎమ్మెల్యే రేఖానాయక్, ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీ బాయితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజనులు గుస్సాడీ నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పౌష్టికాహార స్టాళ్లను పరిశీలించారు. పారిశ్రామిక వేత్తలకు చెక్కు అందించారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 17 : మండలంలోని ఎక్స్రోడ్ లింగోజి తండాలో ఐటీడీఏ పరిశ్రమల భవనంలో 500 లీటర్ల సామర్థ్యం గల పాలశీతలీకరణ కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఇంద్రవెల్లి, జూన్17 : హర్కాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొని, మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న పాఠశాల భవనానికి భూమిపూజ చేశారు.
కుభీర్, జూన్ 17 : బ్రహ్మేశ్వర్, బెల్గాం తండా, పల్సి తండాల్లో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు జీపీల భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. మల్లేశ్వర్ నుంచి ఆర్అండ్బీ రోడ్డు వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.
నెన్నెల,జూన్17 : కొత్తూర్లో జరిగిన గిరిజనోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బాలికలు గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. కొత్తూర్ గ్రామ అభివృద్ధికి ఏసీడీపీ కింద రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
కాసిపేట, జూన్ 17 : మల్కేపల్లి, లంబాడీతండా(డీ) గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన గిరిజనోత్సవాల్లో కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ర్యాలీగా మల్కేపల్లికి చేరుకొని భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లంబాడీతండా(డీ)లో పూజా కార్యక్రమంలో పాల్గొని గిరిజన పెద్దలను సన్మానించారు.
హాజీపూర్, జూన్ 17 : ర్యాలీగఢ్పూర్, నాగారం, చిన్నగోపాల్పూర్ గ్రామాల్లో గిరిజనోత్సవాలకు ఎమ్మెల్యే దివాకర్రావు హాజరుకాగా, గిరిజనులు సంప్రదాయ వాయిధ్యాలతో స్వాగతం పలికారు. నృత్యాలతో హోరెత్తించారు.
కాసిపేట, జూన్ 17 : సోమగూడెం(కే) గ్రామ పంచాయతీలో అదనపు కలెక్టర్ రాహుల్ పాల్గొని గిరిజన పెద్దలను సన్మానించారు. గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ తీశారు. జెండా ఎగురవేశారు.
కోటపల్లి, జూన్ 17 : ఎసన్వాయి, రాజారాం గ్రామాల్లో గిరిజనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజనులు, బంజారాల ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కెరమెరి, జూన్ 17 : జోడెఘాట్లో గిరిజనోత్సవంలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని భీం విగ్రహం, కుమ్రం సూరు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీం సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ఏర్పడ్డిన తర్వాత సీఎం కేసీఆర్ రూ.25 కోట్లతో జోడెఘాట్ను పర్యాటకంగా తీర్చిదిద్దారని కొనియాడారు.
జైనూర్, జూన్ 17 : మార్లవాయిలో గిరిజనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ బోర్కడే హేమంత్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఎస్పీ సురేశ్కుమార్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పద్మశ్రీ కనకరాజును ఆదర్శంగా తీసుకుని కళా నైపుణ్యంలో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. అనంతరం భూసిమెట్టలో రూ.4 కోట్లతో నిర్మించాల్సిన అదనపు తరగతి గదులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి భూమి పూజ నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆడబిబిడ్డలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు.