బజార్హత్నూర్ : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. శనివారం మండలంలోని జాతర్ల గ్రామం మినిస్టేడియంలో మాజీ ఎంపీ గోడం నగేశ్, నవజ్యోతి యూత్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గుస్సాడీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర పాడిపరిశ్రమ చైర్మన్ లోక భూమారెడ్డి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కెరావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ముందుగా గుస్సాడీ వేశాధారణ సామగ్రీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో అంకిత్ మాట్లాడుతూ.. అడవిబిడ్డల ఆచార,సంప్రదాయలు ఎంతో గొప్పవని భావితరాల వారికి వాటిని అందించాలని కోరారు.
ఆదివాసీ ప్రజలకు నిత్యం అందుబాటులలో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కారించేందుకు కృషిచేస్తానన్నారు. మాజీ ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతియేటా గుస్సాడీల సమ్మేళనం జరుతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం గుస్సాడీ బృందాలకు రూ.10వేల చెక్కులను పీవో చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ ఈశ్వర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకన్న, నాయకులు అల్కెగణేశ్, నానం రమణ, రాములు, వినాయక్, భోజన్న, శ్రీనివాస్, జడ్పీటీసీలు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.