నిర్మల్ టౌన్, మే 6 : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఎన్నికల నిర్వహణ, ఈవీఎంల ర్యాండమైజేషన్పై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి, రెండో ర్యాండమైజేషన్, ఈవీఎంల కమిషనింగ్ అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామని, ఎండలు అధికంగా ఉన్నందున ఓటర్లకు ఇబ్బంది కలుగకుండా పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, బెంచీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పోలింగ్ శాతం పెంచేలా స్వీప్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఉదయం 6 గంటలకు నిర్వహించనున్న 5 రన్ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచారు. గోదాములో గల ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, నిర్మల్, ముధోల్, ఉట్నూర్ ఆర్డీవోలు రత్నకల్యాణి, కోమల్రెడ్డి, జివాకర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్రెడ్డి, రవి, సిరికొండ రమేశ్, గండ్రత్ రమేశ్, మజార్, హైదర్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.