జన్నారం/కడెం, మార్చి 16: జన్నారం మండల కేంద్రానికి చెందిన తోకల రాకేశ్ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేయగా, కరీంనగర్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాకేశ్ కడెం ప్రాజెక్టు నీటి పారుదలశాఖ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే కార్యాలయంలో సూపరింటెండెంట్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ తనను వేధిస్తున్నారని శుక్రవారం తల్లి సరస్వతి, తమ్ముడు విశేష్కు చెప్పుకొని బాధపడ్డాడు. కాసేపటికే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జన్నారంలో ప్రాథమిక చికిత్స అందించి, కరీంనగర్ దవాఖానకు తరలించారు.
జన్నారం పోలీసులు కరీంనగర్లోని దవాఖానకు చేరుకొని రాకేశ్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ బిక్లాల్నాయక్ తెలిపారు. కాగా, రాకేశ్ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పై అధికారులు ప్రభాకర్, శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు జన్నారం అదనపు ఎస్ఐ మృత్యుంజయ సర్కార్ తెలిపారు. రాకేశ్ మృతదేహాన్ని లక్షెట్టిపేటకు తరలించి పోస్టుమార్టం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ సతీశ్ అక్కడికి చేరుకున్నారు. బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని కుటంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా, రాకేశ్ తండ్రి సురేశ్ రెండు నెలల క్రితమే గుండెపోటుతో మృతి చెందాడు.