బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పది జిల్లాల నుంచి బాల బాలికలు తరలివచ్చి గణితం, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీవవైవిద్యం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, కలలు, సంస్కృతివంటి అంశాలపై ప్రదర్శనలు ఇవ్వనున్నారు. విజేతలకు బహుమతులతో పాటు మెమొంటోలు అందించనున్నట్లు ఆర్సీవో స్వరూపారాణి తెలిపారు.
బెల్లంపల్లిరూరల్, నవంబర్ 23 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి 26 వరకు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నది. ఇందులో భాగంగా గురువారం నుంచి శనివారం వరకు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించేందుకు ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు.
బెల్లంపల్లి బాలికల గురుకులంలో ఏర్పాట్లను ఆర్సీవో బుధవారం పరిశీలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 9 బాలుర, 13 బాలికల గురుకులాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 5 బాలుర, 6 బాలికల గురుకులాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2 బాలుర, 4 బాలికల గురుకులాలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 7 బాలుర, 13 బాలికల గురుకులాలకు చెందిన విద్యార్థులు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొననున్నట్లు ఆమె చెప్పారు.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు చెందిన 23 బాలుర, 36 బాలికల గురుకులాలు కలిపి మొత్తం 59 కళాశాలల నుంచి 118 ఎగ్జిబిట్స్ను ప్రదర్శించనున్నారు. ప్రతి ఎగ్జిబిట్లో ఇద్దరు విద్యార్థులు తమ ప్రదర్శన విశేషాలను వివరిస్తారని, వీరికి గైడ్ టీచర్ ఉంటారు. 236 మంది విద్యార్థులు, 118 మంది గైడ్ టీచర్లు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారు.
నిత్య జీవితంలో గణితం, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీవవైవిధ్యం,సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, కళలు, సంస్కృతి అంశాలపై విద్యార్థులు తమ ప్రదర్శనలను తీసుకురానున్నారు. జోనల్ స్థాయిలో ప్రతి అంశంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయనున్నారు. ఉత్తమ ప్రదర్శనలకు సర్టిఫికెట్, జ్ఞాపికతో పాటు ప్రథమ బహుమతికి రూ.1000, ద్వితీయబహుమతికి రూ.750, తృతీయ బహుమతికి రూ.500 నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు.
ఐదు అంశాల్లో ప్రథమ స్థానం దక్కించుకున్న ఐదు ప్రదర్శనలను రాష్ట్ర స్థాయికి పంపించనున్నారు. కాగా, మొదటి రోజు వైజ్ఞానిక ప్రదర్శనను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించనున్నారు. ఆర్సీవో వెంట ఏఆర్సీవో కే ఉమామహేశ్వర్రావ్, మంచిర్యాల డీసీవో రామాల బాలభాస్కర్, బెల్లంపల్లి(బాలుర), కాసిపేట (బాలుర), బెల్లంపల్లి (బాలికల) ప్రిన్సిపాళ్లు ఐనాల సైదులు, ఊటూరి సంతోష్, ఎస్ స్వరూపతో పాటు ఉపాధ్యాయులు దశరథరామ్, పరమేశ్వరి, స్వప్న, అపర్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.