నిర్మల్ అర్బన్, మే 16: పాలిటెక్నిక్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ప్రవేశం కోసం బుధవారం జిల్లాలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో 2475 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కో ఆర్డినేటర్ అన్నపూర్ణ తెలిపారు. పరీక్షా సిబ్బంది సమావేశం ఏర్పాటు చేసి. పలు సూచనలు చేశారు. విద్య, రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులు అందుబాటులో ఉంచుతున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. గంట ముందుగానే కేంద్రంలోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా నిరాకరిస్తారు. హాల్టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు.
పరీక్షా కేంద్రాలివే..
పట్టణంలో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శాంతినగర్లోని బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, శాంతినగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, శాంతినగర్ బాలికల విద్యాలయం,సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లను పూర్తి చేశాం. నిర్మల్ జిల్లాలో ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నాం. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. విద్యార్థులు గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
-పీ అన్నపూర్ణ, కోఆర్డినేటర్
ఆదిలాబాద్ జిల్లాలో..
ఎదులాపురం, మే 16: పాలీసెట్ 2023కు అన్ని ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్, సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పీ భరద్వాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనుట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్షా కేంద్రాల్లో 1200 మంది విద్యార్థులు హాజరవనున్నారు. కేంద్రంలోకి గంట ముందుగానే అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోతమని స్పష్టం చేశారు. హాల్ టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని, ఎలక్ట్రానిక్ వాహనాలు అనుమతించబోమని చెప్పారు.