కెరమెరి/ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, ఆగస్టు 18 : కాలంతో పాటే జ్ఞాపకం చెదిరిపోతుంది.. కానీ ఛాయాచిత్రంలో నిలిచిపోతుంది.. మనసు బాగాలేనప్పుడు ఫొటో ఆల్బమ్ను తిరిగేయండి చాలు. ఒక్కసారి మీ మూడ్ మారిపోతుంది. మధుర జ్ఞాపకాలు మీ ముందు కదలాడుతాయి. ఒక్కో ఫొటో ఒక్కో అనుభూతినిస్తుంది. నవ్వులు పూయిస్తుంది. మన అనుకున్న వాళ్లను గుర్తుకు తెచ్చి ఆనందంతో పాటు కన్నీళ్లూ తెప్పిస్తుంది. ఇక ప్రకృతి రమణీయ దృశ్యం కూడా ఆహ్లాదం పంచుతుంది. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ సందర్భంగా జీవన, ప్రకృతి రమణీయ ఛాయాచిత్రాలు మీ కోసం..
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక. ఒక్క ఛాయాచిత్రం కోటి భావాలకు ప్రతీక. కోట్లాది పదాల్లో, లక్షలాది పంక్తుల్లో, వేలాది పేజీల్లో వర్ణించినా కలగని అనుభూతి ఒక్క ఫొటోతో కలుగుతుంది. అక్షరం, శబ్ధం కన్నా దృశ్యం అత్యంత శక్తివంతమైంది. కరుణ, భక్తి, హాస్య, రౌద్ర, శాంత, బీభత్స, భయానక, శృంగార, వీర రసాలకు అద్దం పట్టేదే చిత్రం. ఆధునిక యుగంలో అవనిపై విరిసిన ఇంద్రధనస్సే ఫొటో! కాలానికి కళ్లెం వేసి, దృశ్యాన్ని సజీవం చేసే ఫొటోగ్రఫీకి వందల ఏళ్ల చరిత్ర ఉంది.