అడవి అమ్మలాంటిది. అన్ని జీవులను అక్కున చేర్చుకుంటుంది. ఆహారం, ఔషధాలను ఇస్తుంది. ఆశ్రయంతోపాటు మానవుడి మనుగడకు కావాల్సిన ప్రాణవాయువును పంచుతుంది. ప్రస్తుతం అడవులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి. నేడు(గురువారం) ‘ప్రపంచ అటవీ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం..
మంచిర్యాల అర్బన్, మార్చి 20: అడవులు మానవుడితోపాటు సకల జీవకోటి మనుగడకు ఆధారం. నేటి ఆధునిక మానవుడు తన విజ్ఞానంతో వనరులను విపరీతంగా వినియోగించుకుంటున్నాడు. అటవీ సంపదను నాశనం చేస్తూ తన మనుగడని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. ఎన్నో జీవులకు రక్షణగా ఉండే అడవి ఆవరణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాడు. జీవుల మనుగడకు ఆధారమైన ఆహారపు గొలుసును కాపాడే వనాలను విచ్చలవిడిగా నరికి వేస్తూ సకల జీవ కోటి వినాశనానికి కారణమవుతున్నాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం అడవులు, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో అడవుల శాతం పెరిగింది. కానీ కొందరు స్మగ్లర్ల ధనదాహానికి అడవి బలైపోతున్నది. ఒక చెట్టు నరికితే రెండు మొక్కలు నాటి వాటిని కాపాడాలని, రహదారుల పక్కన పెద్ద చెట్టును తొలగిస్తే తొమ్మిది మొక్కలు నాటి పెద్దగా ఎదిగేంత వరకు సంరక్షించాలని పర్యావరణ చట్టాలు చెబుతున్నా, పాలకుల చెవులకు వినపడడం లేదు.
ఆహారం, ఆశ్రయం, ఔషధాలు, కలప, కాగితం, పండ్లు, పట్టు, తేనే, జిగురు, సుగంధ ఉత్పత్తులు తదితర ఎన్నో అడవుల్లో లభిస్తాయి. జంతువులు వదిలే కార్బన్డయాక్సైడ్ను గ్రహించి మనకు అవసరమైన ప్రాణవాయువును అందిస్తాయి. బాగా పెరిగిన ఒక చెట్టు సుమారు 25 వేల కిలో మీటర్లు తిరిగిన కాలుష్యాన్ని నివారిస్తుంది. ఒక హెక్టారు గ్రీన్బెల్ట్ ఏరియా 30 నుంచి 50 టన్నుల దుమ్ము కణాలను పీల్చుకుంటుంది. 100 చదరపు మీటర్లు ఆవరించి ఉన్న చెట్టు ఆకులు ప్రతి రోజు కిలో గ్రామ్ ఆక్సిజన్ను విడుదల చేస్తుం ది. అందుకే అడవులను కాపాడుకోవడం బాధ్యతగా తీసుకోవాలి.