చెన్నూర్ టౌన్/మందమర్రి, డిసెంబర్ 22 : సాధారణంగా హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ, ఈ రెండింటి కలయికతో ఆచరించే ఒకే ఒక్క పండుగ ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత (సౌరమానం) వచ్చే శుద్ధ ఏకాదశి(చంద్రమానం) రోజున ముక్కోటి ఏకాదశి వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఉండి స్వామిని దర్శించుకుంటే కోటి యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి పండుగను భక్తులు శనివారం వైభవంగా జరుపుకునేందుకు ఆలయాల్లో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాక ప్రాచుర్యంలో ఉంది. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈనాడే మధుకైటభులనే రాక్షసులకు శాపవిమోచనం కలిగించి, వారికి తన వైకుంఠ ద్వారం వద్ద విష్ణువు దర్శనాన్ని అనుగ్రహించాడు. తమలాగే ఈరోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో, వారికి మోక్షాన్ని ప్రసాదించమని వారు వేడుకున్నారట. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ఏకాదశి రోజే వైకుంఠంలోని విష్ణుమూర్తి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి. అందుకే దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అనే పేరు స్థిరపడింది. వైకుంఠ ఏకాదశి రోజు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ (ఉత్తర) ద్వారం గుండా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తారు.
చెన్నూర్లోని జగన్నాథ, మందమర్రి పట్టణంలోని వేంకటేశ్వర ఆలయాల ఉత్తర ద్వార దర్శనం కోసం నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి తెల్లవారుజాము నుంచే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటారు. మందమర్రిలో ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి అనంతాచార్యులు, ఆయన తనయుడు నర్సింహాచార్యుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, అర్చన, పుష్పోత్సవం 5.30 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఆయాచోట్ల బారీకేడ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు.