మంచిర్యాల, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా టీఎన్జీవోల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఎన్నికల సందర్భంగా యూనియన్ బై-లా పాటించడం లేదనే విషయం వెలుగులోకి రావడంతో పాటు తాజాగా టీఎన్జీవో లెక్కలపైనా చర్చ మొదలైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్ఎన్జీవో కార్యాలయం కింద ఉన్న షాపుల ద్వారా వచ్చే అద్దెలు, ఫంక్షన్ హాల్ ద్వారా ఆ సంఘానికి వచ్చే ఆదాయం నెలకు దాదాపు రూ.లక్ష వరకు ఉంటుంది.
కానీ ఇందుకు సంబంధించిన లెక్కల రికార్డులను సరిగా నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి. దీనిపై టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరిని వివరణ కోరగా.. యూనియన్ బై-లా ప్రకారం అసెట్ రికార్డులు నిర్వహిస్తున్నామన్నారు. అలాగైతే ఆ రికార్డులు చూపండి అని అడుగగా.. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా చూపిస్తామంటూ దాటవేశారు. పోయిన నెలదైనా చూపించాలని కోరగా.. అద్దెలు ఏ నెలది.. ఆ నెల ఇవ్వరు.. మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తారు.. వారం, పది రోజులయ్యాక రండి రికార్డులు చూపిస్తామని చెప్పుకొచ్చారు.
ఈ విషయమై టీఎన్జీవోలోని కొందరు ఉద్యోగులు గతంలోనే జిల్లా కమిటీని నిలదీయగా.. ముందున్న కమిటీ లెక్కలు మాకు చెప్పలేదని, ఇప్పుడు మేం కూడా చెప్పమంటూ ఆ సంఘాన్ని అన్నీ తానై నడిపే ఓ లీడర్ దురుసుగా సమాధానం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అసలు యూనియన్ లెక్కలు ఉన్నాయా.. ఉంటే చూపించడానికి అంత టైమ్ ఎందుకని కొందరు టీఎన్జీవోలే ప్రశ్నిస్తున్నారు.
టీఎన్జీవోల సభ్యత్వ నమోదు చేయకుండా, ఓటర్ జాబితా లేకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారనే ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో నామమాత్రంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తుంది. కాకపోతే ఇది అన్ని ప్రభుత్వ శాఖల్లో కాకుండా ఇప్పుడున్న కార్యవర్గానికి ఫేవర్గా ఉండే శాఖల్లోనే ఇది చేస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లోనే సభ్యత్వ నమోదు చేస్తున్నారని, త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఆ రెండు శాఖల ఉద్యోగులే పాల్గొంటారని.. వాళ్లే ఎన్నికల అధికారులు, వాళ్లే ఓటర్లు, ఎన్నికయ్యేది కూడా వాళ్లే అంటూ మిగిలిన శాఖల్లోని టీఎన్జీవోలు మండిపడుతున్నారు. విషయం బయటికి వచ్చినందుకే యూనియన్ నాయకులకు ఇప్పుడు బై-లా గుర్తుకు వచ్చిందంటున్నారు.
ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ టీఎన్జీవోను నడిపించే పెద్దలు ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. హడావుడిగా ఎన్నికలు నిర్వహించి యూనియన్ పగ్గాలు దక్కించుకోవాలనే కుట్రల్లో భాగంగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎన్నికలకు వెళ్తున్నారని చెప్తున్నారు. 2023 డిసెంబర్లో సభ్యత్వ నమోదు చేసినట్లు చెప్తున్నా.. ఆ జాబితా ఇవ్వడానికి కూడా ప్రస్తుతం ఉన్న యూనియన్ పెద్దలు ఇష్టపడడం లేదంటున్నారు.
ఓటర్ల జాబితా లేకుండా… యూనియన్ లెక్క లు తేల్చకుండా జిల్లాలోని ఆరు యూనిట్లలో ఎన్నికలకు ఎలా వెళ్తారు అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలకు సమాధానాలు చెప్పాలని, గడిచిన మూడేళ్ల ఆదాయ, వ్యయాల రికార్డులను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారం, పది రోజుల టైమ్ అడిగేది లెక్కలను తారు మారు చేసేందుకేనని పలువురు ఆరోపిస్తున్నారు. అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చాకే ఎన్నికలకు పోవాలని, ఈ మేరకు టీఎన్జీవో రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకోవాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
టీఎన్జీవో సంఘంలో వివాదాలు ముదరడంతో ఎన్నికలు వాయిదా వేసే ఆలోచనకు ప్రస్తుత జిల్లా కమిటీ వచ్చినట్లు తెలిసింది. వారం ముందు ఓటర్ జాబితా విడుదల చేయాలనే నిబంధన మేరకు ఈ నెల 28వ తేదీన ఎన్నికలు జరగాల్సిన చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లిలోని ఓటర్ల జాబితాను జనవరి 22వ తేదీనే(సోమవారం) ప్రచురించాలి.
కానీ జాబితాను విడుదల చేయలేదు. 23న ఓటర్ల జాబితాను ప్రచురించడం, లేని పక్షంలో వారం పాటు ఎన్నికలను వాయిదా వేయడం అన్న విషయమై చర్చిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరి టీఎన్జీవోలు ఏం చేస్తారు.. వస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్పి ఎన్నికలకు వెళ్తారా.. లేక దాటవేసే ధోరణిలోనే ఎన్నికలు పూర్తి చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.