మంచిర్యాల, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పులి పిల్లల సెర్చ్ ఆపరేషన్ ఓ కొలిక్కి వచ్చింది. విష ప్రయోగంతో ఎస్-9(మగ పులి)తో పాటు మరో పిల్ల పులి ఎస్-15 కూడా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈనెల మొదటివారంలో రెండు రోజుల తేడాతో రెండు పులుల మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రెండు పులులతోపాటు మరొకటి కూడా విష ప్రయోగం చేసిన పశు మాంసాన్ని తిన్నట్లు తెలియడంతో ఎస్-9 జతగా ఉన్న ఆడపులి ఎస్-6తోపాటు దాని మరో రెండు పులి పిల్లల జాడపై ఉత్కంఠ నెలకొన్నది.
దీంతో నాలుగు రోజులుగా అధికారులు కంటి మీద కునుకు లేకుండా అడవిని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో దరిగాం అటవీ ప్రాంతంలో ఎస్-6 పులి ఓ పశువును వేటాడుతూ సీసీ కెమెరాకు చిక్కింది. ఈ నెల 11వ తేదీన రికార్డు అయిన ఈ దృశ్యాన్ని శనివారం అధికారులు విడుదల చేశారు. చనిపోయి ఉంటుందని భావిస్తున్న పులి కెమెరాకు చిక్కడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దాని పిల్లలైన మరో రెండు పులి పిల్లల పాదముద్రలు కూడా తాజాగా దొరకడంతో ఎస్-6తో దాని సంతానమైన మరో రెండు పులులు క్షేమంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.
కాకపోతే మిగిలిన పులుల పాద ముద్రలతోపాటు సీసీ కెమెరాల్లో లేదా లైవ్ కెమెరాల్లో ఆ పులులు కనిపించాల్సి ఉంటుంది. కాగా.. ఎస్-6తోపాటు పిల్లల్లో ఒకటైన మరో పులిని ఓ అధికారి అడవిలో చూసినట్లుగా చెప్తున్నారు. ఇక పులుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ శనివారం కొనసాగింది. దాదాపు 80 మంది అధికారులు 12 నుంచి 13 బృందాలుగా విడిపోయి అడవిని జల్లెడ పట్టారు. మిగిలిన పులుల జాడ తెలిసే వరకు ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఎస్-6(ఆడపులి) జతగా ఉన్న ఎస్-9 మృతి చెందడంతో కాగజ్నగర్ రేంజ్లో పులుల మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోపాటు స్థానికుల ఆగ్రహం పులి మరణానికి దారి తీయడం అటవీ శాఖ అధికారుల్లో పెద్ద చర్చనీయంగా మారింది. నిబంధనల ప్రకారం పులుల ఆచూకీని బయట ఎవరికీ చెప్పకూడదు. పులి సంచరిస్తున్నదని తెలిస్తే స్థానికంగా ఉంటే వేటగాళ్లకు సమాచారం ఇచ్చినట్లు అవుతుందని జాగ్రత్తలు పాటిస్తారు.
కానీ.. వరుసగా రెండు పులుల మరణంతో మీడియా ఫోకస్ మొత్తం అటవీ శాఖపైకి మళ్లింది. పులులు ఏమయ్యాయి? బతికున్నాయా? చనిపోయాయా? అనే సమాచారం రోజూ బయటికి వెళ్తున్నది. దీంతో జాగ్రత్తలు వహిస్తున్నామని అటవీ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందుకే ఎస్-6 రికార్డును రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేసినట్లు చెప్పారు. ఎస్-9 మృతి చెందినప్పటికీ సిర్పూర్ రేంజ్కు ఇటీవల వచ్చిన ఎస్-10 (మగ పులి) కదలికలను గుర్తించినట్లుగా సదరు అధికారి తెలిపారు. ఎస్-6తో జత కట్టడానికి అది సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాకపోతే ఆ పులి పాదముద్రలు మాత్రమే ఇప్పటివరకు అధికారులకు దొరికాయి. అది కూడా కెమెరా ట్రాప్లో ఎక్కడా దొరకలేదు. సిర్పూర్ మండలం వేంపల్లి, చీలపల్లి అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం అది సంచరిస్తున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా కాగజ్నగర్, ఆసిఫాబాద్, సిర్పూర్ రేంజ్లలో 10కి పైగా పులులు నిత్యం సంచరిస్తున్నాయి. తాజాగా.. రెండు పులుల వరుస మరణాలతో మిగిలిన పులుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలోనే మహారాష్ట్ర అటవీశాఖ అధికారులతో తెలంగాణ అధికారులు సమావేశమై పులుల సంరక్షణ, నిత్యం రాకపోకలు సాగించే పులుల సమాచారం ట్రాక్ చేయడం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.