ఆదిలాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ నియోజకవర్గం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న కోరారు. మంగళవారం ఆదిలాబాద్లోని అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన ప్రచార ముగింపు సభకు హాజరయ్యారు. డైట్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీకి 15 వేల మంది తరలిరాగా పలు వీధుల గుండా నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాలు, కండువాలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో రూ.5350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కోసం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని తెలిపారు. రెండు ఐటీ కంపెనీల్లో యువత ఉపాధి పొందుతున్నారన్నారు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వ్యవసాయ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభిస్తున్నామన్నారు. చనాక- కొరాట ప్రాజెక్టు ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అన్ని వర్గాల ప్రజల కోసం కమ్యూనిటీ హాళ్లు, సంఘ భవనాలు నిర్మించినట్లు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో జిల్లాలో ప్రజల ఉపాధి మెరుగుపడిందన్నారు. బీఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై 11 వేల మంది యువత ఇప్పటికే గులాబీ కండువా కప్పుకున్నారని, మహిళలు, స్థానికుల ఎక్కువగా సంఖ్యలో పార్టీ చేరారు.
నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే తనను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని వారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, అందరి సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా తనకు గుర్తింపు ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలు తాను చేసిన సేవలను గుర్తించి కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గెలిపించి మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించాలని వేడుకున్నారు.
రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తామంటూ. రైతుబంధుని ఆపిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థిని కుక్కర్, లిక్కర్ బాబుగా అని మహిళలపై ఆయనకు కనీస గౌరవం లేదన్నారు. బీజేపీ మోసాకారి పార్టీ అని మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షల జమచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి రూ.1200 పెంచారని, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని మోసం చేశారన్నారు.
మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు ఈ ఎన్నికల్లో ఓట్లతో బుద్ధి చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు యూ నిస్ అక్బానీ, రోకండ్ల రమేశ్, జహీర్ రంజానీ, ఆశన్న, శివకుమార్, రమేశ్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 28: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల రూపు రేఖలు మారాయని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. మావలతో పాటు బట్టిసావర్గం, వాగాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న మాట్లాడుతూ హనుమాన్ ఆలయం లేని ఊరు ఉండదు, సంక్షేమ పథకం అందని ఇల్లు ఉండదన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే మూడోసారి బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టనున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మవద్దని, కారు గుర్తు సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు రక్ష అని స్పష్టం చేశారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నల్ల వనిత, ఎంపీపీ సంగీత, సర్పంచ్ ప్రమీల, ఎంపీటీసీలు మయూరి, నాయకులు నల్ల రాజేశ్వర్, రాగం గోవర్ధన్, ఎవన్, ఉమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 28 : అన్ని వర్గాల ప్రజల సంతోషం కోరే మనిషి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నకే మద్దతు ఇచ్చి గురువారం నిర్వహించే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్ కోరారు. కలెక్టర్చౌక్లో దుర్గం ట్రస్ట్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు దయానంద్ కాంబ్లే, జబడే బాబాసాహెబ్, అనిల్సాల్వే, గంగారాం బోర్కర్, సూరజ్ సోన్ కాంబ్లే, మహేందర్, కావేటి మోహన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఎదులాపురం, నవంబర్ 28 : ప్రజా సంక్షేమ కోసం, దళితుల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను మరిచిపోము అని, బీఆర్ఎస్కు దళిత సంఘాల మద్దతు ఉంటుందని నేతకాని మహార్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, దుర్గం ట్రస్ట్ చైర్మన్ శేఖర్ అన్నారు. బీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ ర్యాలీకి దళిత సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. డైట్ మైదానంలో దళిత సంఘం నీలి జెండాను చేతపట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు జోగు మహేందర్, దళిత సంఘాల నాయకులు రాజారెడ్డి, దుర్గం నారాయణ, గంగారాం, దయానంద్కాంబ్లే, సాంబాజీ పవార్, అనిల్, పాల్గొన్నారు.
జైనథ్, నవంబర్ 28 : మండలంలోని బాలాపూర్, జైనథ్, బెల్లూరి, మాకోడ, కోరట, మేడిగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో సర్పంచ్లు దేవన్న, వినోద్ యాదవ్, నాయకులు గడ్డం జగదీశ్ రెడ్డి, గణేశ్ యాదవ్, బాలాజీ, మహేశ్, రూపేశ్ పాల్గొన్నారు.