ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సాగు ఆశాజనకంగా ఉంది. జిల్లాలో ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 5,70,520 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. గతేడాది కంటే ఈసారి 10 వేల ఎకరాల విస్తీర్ణం పెరిగింది. అధికంగా పత్తి 4,10,070 ఎకరాలు, సోయాబీన్ 91,324 ఎకరాలు, కంది 60,195 ఎకరాల్లో పంటలు పండుతున్నాయని అధికారులు క్రాప్ బుకింగ్ సర్వేలో తేల్చారు. ప్రస్తుతం పత్తి కాయ దశలో ఉండగా, సోయాబీన్ గింజలు తయారవుతున్నాయి. కంది మంచి ఎదుగుదల దశలో ఉంది. సరైన సమయంలో వర్షాలు కురియడంతో దిగుబడి కూడా అదే విధంగా వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, సెప్టెంబరు 19 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రభు త్వం ‘రైతు బంధు’ సాయం అందించడం, సకాలంలో విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయడంతో సరైన సమయంలో రైతులు పంటలు వేసుకున్నారు. సీజన్ ప్రారంభం నుంచి సాగు కు వర్షాలు, వాతావరణం అనుకూలించడం వల్ల పంటల ఎదుగుదల బాగా ఉంది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఏటా పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.
జిల్లాలో రైతులు పండిస్తున్న పంటల వివరాలను తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ అధికారులు క్రాఫ్ బుకింగ్ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో 102 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వివి ధ పంటల సాగు విస్తీర్ణాన్ని ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లాలో వానకాలం సీజన్లో 5,70, 520 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు గుర్తించారు. వీటిల్లో అధికంగా 4,10,070 ఎకరాల్లో పత్తి, 91,324 ఎకరాల్లో సోయాబీన్, 60,195 ఎకరాల్లో కంది, 3,795 ఎకరాల్లో మక్క, 1815 ఎకరాల్లో వరి, 1761 ఎకరాల్లో జొన్న, 720 ఎకరాల్లో మినుము, 654 ఎకరాల్లో పెసర పంటల సాగవుతున్న వివరించారు.
ఆశాజనకంగా పంటలు..
జిల్లాలో వానకాలంలో పంటల సాగు ఆశాజనకంగా ఉంది. పత్తి కాయదశలో ఉండగా, సోయాబీన్లో గింజలు పెరుగుతున్నాయి. కంది పంట మంచి ఎదుగుదల దశలో ఉంది. పంటల సాగులో భాగంగా రైతులకు అవసరమైన ఎరువులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం సోయాబిన్లో ఎలాంటి ఎరువులూ అవసరం లేదని, పత్తికి మరోసారి అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో మంగళవారం వరకు సాదారణ వర్షాపాతం 680.4 మిల్లీ మీటర్లకు గాను, 793.8 మిల్లీ మీటర్లుగా నమోదైంది.
దీంతో ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంది. జైనథ్ మండలం మత్తడి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 మీటర్లకు, 286 మీటర్లు, తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టు నీటిమట్టం 277.50 మీటర్లకు గానూ 277.50 మీటర్లుగా ఉంది. చెరువుల్లో సైతం నీరు నిం డుగా ఉన్నది. దీంతో రైతులకు రెండు పంటలకు అవసరమైన నీటిని అందించేందుకు అధికారు లు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.
దిగుబడులు బాగా ఉంటాయి….
ప్రభుత్వం రైతులకు పంటల సాగులో అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నది. దీంతో జిల్లాలో ఏటా పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ ఏడాది వానకాలంలో జిల్లాలో 5,70,520 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేస్తున్నారు. పత్తి కాయ దశలో ఉన్నది. సోయాబీన్ గింజ దశలో ఉండగా, 20 రోజుల తర్వాత దిగుబడులు వస్తాయి. రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పంటలను పరిశీలిస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.
– డీ పుల్లయ్య, వ్యవసాయశాఖ అధికారి, ఆదిలాబాద్ జిల్లా