కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్న మూడు గంటల కరెంటుతో పంటలెలా పండుతయని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటుకోసం ముప్పుతిప్పలు పడ్డామని, ఆహర్నిశలు కష్టపడి సాగు చేసిన పంటలు చేతికివచ్చే దశలో కరెంటు లేక ఎండిపోయేవని గుర్తు చేసుకొని బాధపడుతున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటలు కరెంటు సరిపోతుందని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని చెప్పడం రైతులను మోసం చేయడమేనని మండిపడుతున్నారు.
10 హెచ్పీ మోటార్ల వల్ల ఓవర్లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడమే కాకుండా భూగర్భజలాలు అడుగంటిపోతాయని, పంటలకు నీరు అందించలేని దుస్థితి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని కొనియాడుతున్నారు. కాంగ్రెస్ను నమ్మి తిరిగి కరెంటు కష్టాలను కొని తెచ్చుకునే పరిస్థితుల్లో లేమని, రైతుబిడ్డ కేసీఆర్ వెంటే నడుస్తామని స్పష్టం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, నవంబర్ 27 ( నమస్తే తెలంగాణ)
గుడిహత్నూర్, నవంబర్ 27 : రైతులు కాంగ్రెస్ నాయకులను, ఆ ప్రభుత్వాన్ని నమ్మే రోజులు పోయాయి. మళ్లీ రైతులను నమ్మించి మోసం చేయాలని వస్తున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఏనాడు 24 గంటలు కరెంట్ ఇద్దామన్న ఆలోచన చేయలేదు. కనీసం రైతు చనిపోతే ఆ కుటుంబం ఎలా ఉంది అని మందలించిన వాళ్లు లేరు. కాంగ్రెసోళ్లకు ఎన్నికలు వచ్చినప్పుడే రైతులు గుర్తుకు వస్తరు. నా పాణం ఉన్నంత వరకు కరెంట్ విషయంలో కాంగ్రెస్ను నమ్మను. కాంగ్రెస్ వచ్చేది లేదు..సచ్చేది లేదు.. ఆగమైన కరెంట్ను ఎంతోమంచిగా సీఎం కేసీఆర్ చేసిండ్రు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఉంటుంది. సీఎం కేసీఆర్ను మరువలేను.
– గుళుగుండె జనార్దన్, రైతు,లింగాపూర్
సొనాల, నవంబర్ 27 : కాంగ్రెస్ పాలనలో పంటకు నీళ్లు పెట్టేందుకు కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక అరిగోస పడ్డం. పంటను కాపాడుకునేందుకు ఎన్ని ఆప సోపాలు పడ్డామో మాకు తెలుసు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం నయమైంది. రెండు పంటలకు సరి పడా నీరు అందుతుంది. రైతుల బాధ తెలిసిన వ్యక్తి కాబట్టే సీఎం కేసీఆర్ 24గంటల కరెంట్ ఇస్తుండు. కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంట్ చాలంటే ఏడంగ పంటలు పండుతయి. రైతుల ఆగం కావాల్నా. 10 హెచ్పీ మోటర్లు పెట్టు కోమంటున్నరు.. ఏడంగ తెచ్చేది.. కాంగ్రెసోళ్లు మళ్లీ రైతులను ఇబ్బంది పెట్టడం కాకపోతే ఇంకేంటి. రైతులు బీఆర్ఎస్కే మద్దతు నిలుస్తారు. – తుల ప్రమోద్, రైతు, సొనాల
సొనాల, నవంబర్ 27 : ఇప్పుడున్న కరెంట్తో వ్యవసాయంను పండుగలా చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఇస్తున్న 24 గంటల కరెంట్తో బాధలన్నీ తీరాయి. కాంగ్రెసోళ్లు మూడు గంటలు కరెంట్ ఇస్తామని మాటలు చెబుతున్నారు. వారికి వ్యవసాయం గురించి పూర్తిగా తెలియదు. కాంగ్రెస్ వద్దు…వారి కరెంట్ వద్దు. తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చే కరెంట్తో సంతోషంగా ఉన్నాం. మళ్లీ బీఆర్ఎస్సే రావాలి.
-టీ లస్మారెడ్డి, రైతు, గుట్టపక్కతండా గ్రామం, సొనాల మండలం
నార్నూర్, నవంబర్ 27 : కరెంటు మూడు గంటలు వస్తే రైతులకు చాలా నష్టమైతది. మూడు గంటల్లో ఏ మూలా తడవదు. గీ కాంగ్రెసోళ్లు ఎప్పుడూ గిట్లనే జేత్తరు. గతంల ఎప్పుడు కరెంట్ అత్తదో, ఎప్పుడు పోతదో తెల్వక శానా ఇబ్బందివడ్డం. మళ్లా గా కష్టం మాకద్దు. ఎల్లప్పుడు కరెంటు ఉంటేనే పంట పండించగలుగుతం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కష్టాలు లేవు. 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇవ్వడంతో మా భూములు మంచిగా సాగు చేస్తున్నం. ఇప్పుడు మళ్లా కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటు ఇస్తామంటున్నారు. గతంలో ఎన్నో కష్టాలు అనుభవించాం. రైతుకు భరోసా ఇస్తూ 24గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ ఉంటేనే మేమంతా బాగుంటాం.
– చిక్రం మారుతి, రైతు, గంగాపూర్ నార్నూర్ మండలం
బోథ్, నవంబర్ 27 : మూడు గంటల కరెంట్ అంటే పంటలు మునిగినట్టే. నీళ్లందక ఎండిపోతయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్తో రెండు పంటలు పండించుకుంటున్నం. కాంగ్రెస్ వస్తే ఒకళ్లు మూడు గంటలు, మరొకళ్లు ఐదు గంటల కరెంట్ అంటున్నరు. 24 గంటల కరెంట్ ఇచ్చేటోళ్లను కాదని తక్కువ కరెంట్ ఇస్తామంటున్నోళ్లను రైతులం ఎట్ల నమ్ముతం. నాకున్న మూడు ఎకరాల్లో యాసంగి కింద పత్తి సోయ పంట తీసి, మక్క పండించుకుంటున్న. నిరంతర కరెంట్తో అవసరమున్న సమయంలో నీటి తడులు పెట్టుకుంటున్న. సరిపోయే కరెంట్తో నీటిని అందిస్తుండడంతో దిగుబడి బాగానే వస్తున్నది. కాంగ్రెస్ను నమ్ముకుంటే మళ్లీ టార్చ్లైట్ పట్టుకొని స్టార్టర్ కాడ కరెంట్ కోసం కావలి ఉండాల్సిన పరిస్థితి వస్తది.
– మునిగెల రామృకష్ణ, రైతు, కన్గుట్ట
ఇంద్రవెల్లి, నవంబర్ 27 : కాంగ్రెస్ ఇస్తామన్న 3 గంటల కరెంట్ వ్యవసాయానికి సరిపోదు. 3 గంటలతో మూల కూడ తడవదు. రైతులు 10హెచ్పీ మోటార్లు కొనాలంటే లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. మళ్లీ అప్పుల పాలు కావాల్సిందే. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు సీఎం కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో మా వ్యవసాయ భూముల్లో అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నాం. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెసోడు మాకొద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు కావాలి.
– కోరెంగా సుంగుపటేల్, రైతు, లక్కుగూడ గ్రామం, ఇంద్రవెల్లి మండలం
ఇంద్రవెల్లి, నవంబర్ 27 : కాంగ్రెస్ ఇస్తామన్న మూడు గంటల కరెంట్తో పంటలు పండించుడు కష్టమే. మళ్లా పాత రోజులత్తయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్తో భూముల్లో అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నాం. రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. రైతులను పట్టించుకోని పార్టీలను ఎవరూ నమ్మేస్థితిలో లేరు. కరెంట్ ఉండడంతో యాసంగిలో రైతులు అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మడం లేదు.
– పడ్వాల్ గోపాల్సింగ్, రైతు, అందునాయక్తండా, ఇంద్రవెల్లి
బజార్హత్నూర్, నవంబర్ 27 : నేను చాలా ఏండ్ల నుంచే ఎవుసం చేస్తున్న ఎనకట పొద్దంత పని ఇడిసి పెట్టుకొని కరెంట్ ఎప్పుడు వస్తదా అని ఎదురుచూసేది. అచ్చిన కరెంట్ అరగంటకోసారి ట్రిప్పయేది. గలుమ పారే వరకు మళ్లీ పోయేది. తడిసిన మడి మల్ల తడిసేది. గిట్టా కాలం ఎల్లదీసుకుంటూ వచ్చినం. సీఏం కేసీఆర్ అయినంక 24 గంటల కరెంట్ ఇత్తాండు. మాలాంటి రైతుల కష్టాలను తీర్చిండు. ఎప్పుడు అవసరం ఉంటే మోటారు వద్దకు వెళ్లి చాలు చేసి నీళ్లు పెట్టుకుంటున్నాం. ఇంతకన్న మాకు ఏమి అవసరం లేదు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలి. కాంగ్రెస్ వస్తే మళ్లీ ఎనకటి కాలం వస్తది.వాడద్దు..వాని కరెంట్ వద్దు..ఇప్పుడే మంచిగుంది.
– కొంగర్ల ప్రభులింగు, రైతు, బజార్హత్నూర్
ఉట్నూర్ రూరల్, నవంబర్ 27 : కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కష్టాలు మొదలైతయ్. గతంల పంటలను కాపాడుకునేందుకు రాత్రీపగలు, చలిలో మోటర్ల దగ్గర పడుకొని నీరందిస్తే సగం తడిసేది, సగం ఎండేది. అలాంటి రోజులు మాకద్దు. మళ్లా ఆ బాధలు మాకద్దు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నడు. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటు రైతులకు ఇస్తాం అంటున్నరు. అలాంటి వారికి ఓటెయ్యం. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులందరూ రెండు పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నరు. రైతుకు మెలు చేసునోళ్లను మేమెందుకు మర్చిపోతాం.
– కరాడి పెద్దులు, రైతు, లక్కారం
ఉట్నూర్ రూరల్, నవంబర్ 27 : తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆరు 24 గంటలపాటు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నడు. కానీ కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు సరిపోతదని అంటున్నరు. ఆ మూడు గంటలతోటి ఎంత పొలం పార్తదో వాళ్లే చెప్పాలే. మూడు గంటలు కాదు.. వాల్ల పార్టీదే మూన్నాళ్ల ముచ్చట. మూడు గంటల కరెంటుతో ఎవుసం బందు చేసుకోవాలే. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కరెంటుతో ఎన్నో తిప్పలువడ్డం. కరెంటు కోసం మోటర్ల దగ్గర పండుకొని రాత్రి, పగలు కాపలాకాస్తూ నీరు పెట్టుకున్నం. ఈ ప్రభుత్వం వచ్చినంక ఈ తొమ్మిదేండ్లు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంటలు పండిస్తున్నం. రైతులందరూ సంతోషంగా ఉన్నరు. మూడు గంటల ప్రభుత్వాలు మాకద్దు. రైతులకు కష్టాలు తీర్చే కేసీఆర్ ప్రభుత్వానికే మద్దతిస్తాం.
– బండి శివయ్య, రైతు, లక్కారం