ఆదిలాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): గిరిజన బిడ్డల ఉన్నత చదువులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గూడేలు, తండాల్లోని పిల్లల బంగారు భవిష్యత్కు ఐటీడీఏ ద్వారా బాటలు వేస్తున్నది. అందులో భాగంగా గిరిజన గురుకులాల్లో ఇంటర్ విద్యార్థులు ఐఐటీ, నీట్, ఎంసెట్ల లో కూడా రాణించేలా ‘స్టార్స్ 50’ పేరిట ప్రత్యేక శిక్షణనిస్తున్నది. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థలో సీట్లు సాధించేలా తరగతులు నిర్వహిస్తున్నది. ఇక్కడ శిక్షణ పొందిన వారిలో 47 మంది ఇప్పటివరకు ఐఐటీ, నీట్ లాంటి అత్యుత్తమ విద్యాసంస్థల్లో సీట్లు పొందడం, గిరిజన కుటుంబా ల్లో సంతోషానికి కారణమవువున్నది. కాగా , పేదింటి విద్యార్థులకు వరంగా మారిన ‘స్టార్స్ 50’ కార్యక్రమం పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకపడ్డాయి. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గిరిజన విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీ గూడేలు, గిరిజన తండాల్లోని పాఠశాలల్లో వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకం, ఇంగ్లిష్ మీడియం తరగతులు, పౌష్టికాహారం వంటి వాటిపై శ్రద్ధ చూపింది. పాఠశాల విద్యాభ్యాసం అనంతరం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గురుకుల కళాశాలలు, డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసే విధంగా ఐఐటీ, నీట్, ఎంసెట్ లాంటి పరీక్షల్లో రాణించేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎనిమిదేళ్ల కిందట స్టార్స్ 50 కార్యక్రమాన్ని ఐటీడీఏ అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం గిరిజన విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే వారితో పోటీ పడుతున్నారు. సర్కారు అందించిన శిక్షణతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ఐఐటీలు, ఎన్ఐటీలో సీట్లు సంపాదిస్తున్నారు.
47 మందికి సీట్లు
ఆదిలాబాద్లో 2015-16లో స్టార్స్ 50 ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంట్లో శిక్షణ పొందిన విద్యార్థుల్లో 47 మంది ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు పొందారు. వీరితో పాటు చాలా మంది విద్యార్థులు జేఎన్టీయూలో ఇంజినీరింగ్ సీట్లు సాధించారు. స్టార్స్ 50 శిక్షణకు ఎంపికలో భాగంగా అధికారులు గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ ఆధారంగా ఐఐటీ బ్యాచ్కు 40 మంది ఎంపీసీ, నీట్ బ్యాచ్కు 40 మంది బైపీసీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. వీరితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల కళాశాలల్లో చదువుకుంటూ ఐఐటీ, జేఈఈ మెయిన్స్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కూడా అడ్వాన్స్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ కేంద్రంలో వివిధ విభాగాల్లో నిపుణులతో క్లాసులు నిర్వహిస్తున్నారు. స్టడీ మెటీరియల్ను కూడా అందజేస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఐఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గురుకుల సొసైటీ నుంచి ల్యాప్టాప్ రూ.50 వేలు, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు వచ్చిన వారికి ల్యాప్టాప్, రూ.40 వేలను అందజేస్తారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తాము ఉన్నత విద్యను చదువుకునే అవకాశం లభించినట్లు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిరంతర పర్యవేక్షణతో మెరుగైన శిక్షణ
గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు స్టార్స్ 50 కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేస్తాం. వీరికి రెండేళ్ల పాటు ఐఐటీ, నీట్, ఎంసెట్లో సీనియర్ లెక్చరర్లు, సబ్జెక్ట్ అసోసియేట్ల చేత శిక్షణ అందజేస్తాం. విద్యార్థుల చదువులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. గతంలో వచ్చిన పరీక్షా పేపర్లతో పాటు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తాం. శిక్షణ పొందిన విద్యార్థులు పరీక్షలు బాగా రాసి దేశంలోని వివిధ ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధిస్తున్నారు. ఎంసెట్లో ప్రతిభ చూపి జేఎన్టీయూ, తదితర కళాశాలల్లో కూడా చేరుతున్నారు.
– మారుతిశర్మ, కో ఆర్డినేటర్, స్టార్స్ 50, ఆదిలాబాద్
స్టార్స్ 50 శిక్షణ బాగుంది..
నేను రెండేళ్లుగా స్టార్స్ 50లో ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్ శిక్షణ తీసుకుంటున్నా. మెయిన్స్లో ప్రతిభ చూపడంతో అడ్వాన్స్ పరీక్ష రాసి ఐఐటీలో సీటు సంపా దించాలని పట్టుదలతో చదువుతున్నా. ఇక్కడ అధ్యాపకులు ఫిజిక్స్, కెమెస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులను బోధిస్తున్నారు. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను అర్థం చేసుకొని ఎలా రాయాలనే విషయాలను తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఇలాంటి శిక్షణతో పేద విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం లభించింది.
–బీ అక్షయ, సత్తనపల్లి, ఖానాపూర్ మండలం, నిర్మల్ జిల్లా
కార్పొరేట్ కు దీటుగా బోధన
స్టార్స్ 50 శిక్షణలో భాగంగా కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఇక్కడ శిక్షణ అంది స్తున్నారు. నిపుణులైన అధ్యాపకులు ప్రతి సబ్జె క్టును అర్థమయ్యే విధంగా చెబుతున్నారు. స్టడీ అవర్స్ లో ఏవైనా సందేహాలు ఉంటే వివరిస్తారు. గిరిజన ప్రాంతాల్లో చదువుకున్న మాకు రెండేళ్ల ఈ శిక్షణ ఉన్నత చదువులకు బాటలు వేస్తున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనం, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. మెయిన్స్ అయిపోయింది. అడ్వాన్స్ బాగా రాసి సీటు సాధిస్తాననే నమ్మకం ఉంది.
– ఏ. స్నేహ, విద్యార్థిని, ఉట్నూర్
సీటు కచ్చితంగా సాధిస్తా..
ఇటీవల నిర్వహించిన మెయి న్స్ పరీక్షకు హాజరై 76.9 పర్సంటైల్ సాధించాను. ఇప్పుడు అడ్వాన్స్ శిక్షణ పొందుతున్నా. ఇక్కడ నిపుణులైన అధ్యాపకులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమెస్ట్రీ సబ్జెక్టులను చక్కగా బోధిస్తున్నారు. మెటీరియల్ కూడా బాగుంది. ఉదయం 7నుంచి రాత్రి 9 గం టల వరకు సబ్జెక్టులను బోధించడమే కాకుండా స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. అడ్వాన్స్ పరీక్ష కోసం ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతున్నది.
– బీ తరుణ్, చింతలమానేపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
సీటు వస్తుందనే అనుకుంటున్నా..
నేను ఇచ్చోడ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో చదు వుకుంటున్నాను. మెయిన్స్లో 59 పర్సం టైల్ సాధించా. స్టార్స్ 50లో ఐఐటీ అడ్వాన్స్ కోసం శిక్షణ తీసుకుంటు న్నా. ఇక్కడ సబ్జెక్ట్ నిపుణులతో పలు అంశాలను చక్కగా బోధిస్తు న్నారు. క్లాస్ తర్వాత మా సందేహాలను నివృత్తి చేస్తారు. శిక్షణ బాగా ఉపయోగపడుతుండడంతో అడ్వాన్స్ బాగా రాస్తాననే నమ్మకం కలిగింది. ఐఐ టీలో సీటు తప్పక వస్తుంది.
– పీ నిరంజన్ కుమార్, పిన్నారం, కోటపల్లి, మండలం. మంచిర్యాల జిల్లా