కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోష్ కనిపిస్తున్నది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఓ వైపు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతూనే.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గ ప్రగతిని చూసి ఫిదా అవుతున్న వేలాది మంది యువకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
4 రోజుల్లో రూ.100 కోట్ల పనులకు శ్రీకారం
సిర్పూర్ నియోజకవర్గంలో నాలుగు రోజుల్లో సుమారు రూ.100 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. రూ.75 కోట్లతో కౌటాల మండలం గుండాయిపేట్ వద్ద వార్ధా నదిపై.. మహారాష్ట్రలోని నంది వర్థనం గ్రామాన్ని కలుపుతూ మరో వంతెనకు శ్రీకారం చుట్టింది. ఇటీవల మంత్రి ఐకే రెడ్డి చేతుల మీదుగా వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ వంతెనలు పూర్తయితే సిర్పూర్ నియోజకవర్గానికే కాదు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడి అభివృద్ధి చెందే ఆస్కారమున్నది. అలాగే కౌటాల మండలం కోయగూడ గ్రామాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేస్తూ రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రవీంద్రనగర్లో 133 కేవీ సబ్ష్టేషన్ నిర్మాణానికి, చింతలమానేపల్లి మండలంలో గంగాపూర్కు రూ.2 కోట్లతో బీటీ రోడ్డు, కేతిని-దిందా మధ్య రూ.3 కోట్లతో రోడ్డు నిర్మాణం, రైల్వే గేటు నుంచి వంజిరి రోడ్డుకు రూ.కోటి, ప్రధాన రహదారి నుంచి నందిగూడ వరకు మరో రూ.కోటితో రోడ్ల నిర్మాణాకి శంకుస్థాపనలు చేశారు. అందెవెల్లి-ఈస్గాం మధ్య వాగుపై వంతెన నిర్మాణం, రూ.5 కోట్లతో అచ్చెల్లి-చింతగూడ, శివపురం-హీరాపూర్, పాతట్ల వంతెన నిర్మాణాలు, చింతలమానెపల్లి మండలం కర్జెల్లి రోడ్డుకు రూ. 1.95 కోట్లు, గంగాపూర్ రోడ్డు నిర్మాణానికి రూ. 2.60 కోట్లతో భూమి పూజ చేశారు.
మహారాష్ట్రకు మూడో వంతెన…
రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భావించిన సర్కారు.. పక్కనే ఉన్న మహారాష్ట్రకు రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నది. గతంలో వంతెన లేక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణహిత నదిని నాటు పడవల్లో దాటి మహారాష్ట్రకు వెళ్లేవారు. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం గూడెం వద్ద ప్రాణహిత నదిపై రూ.65 కోట్లతో భారీ వంతెన నిర్మించింది. దీంతో మహారాష్ట్రలోని అహేరి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కలిగింది. తాజాగా వార్ధా నదిపై కౌటాల మండలం గుండాయిపేట్ వద్ద రూ.75 కోట్లతో మహారాష్ట్రలోని నంది వర్థనం గ్రామాన్ని కలుపుతూ మూడో వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టింది. దీంతో ప్రజల మధ్య సత్సంబంధాలతో పాటు వ్యాపారాలు మెరుగుపడనున్నాయి.
అటు అభివృద్ధి.. ఇటు ప్రచారం..
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో ఓ వైపు అభివృద్ధి పనులు చేపడుతూనే ప్రచారంపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక దృష్టిసారించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల వేలాది మంది కార్యకర్తలతో కలిసి బైక్ర్యాలీ తీశారు. రైల్వేగేటు నుంచి వంజిరి, కాగజ్నగర్, చింతగూడ, కోయవాగు, అందవెల్లి, ఇస్గాం, నజ్రుల్నగర్, నామనగర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపారు. సిర్పూర్ నియోజవర్గంలో కోనేరు కోనప్ప చేపడుతున్న అభివృద్ధి పనులకు ఫిదా అవుతున్న యువత, వివిధ పార్టీల్లోని కార్యకర్తలు పెద్ద ఎత్తు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇటీవల మంత్రి ఐకే రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది యువత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.