నవ మాసాలు మోసి బిడ్డలకు జన్మనిచ్చిన ఇద్దరు తల్లులకు.. వారి పేగుబంధం ఎవరో తెలియకుండా పోయింది. తొలిచూరు ఆడపిల్ల పుట్టింది.. ఈ సారి మగ పిల్లాడు (వారసుడు) పుడుతాడేమోనని ఎదురుచూస్తున్న ఆ పిల్లల తండ్రులకు తలనొప్పే మిగిలింది. వైద్య సిబ్బంది చేసిన తప్పుతో ఎవరికి మగ పిల్లాడు, ఎవరికి ఆడపిల్ల పుట్టిందో తెలియకుండా పోయింది. మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మగ పిల్లాడు పుట్టాడని ఇద్దరికీ అబార్షన్ చేయడంతో వివాదం పెద్దదైంది. విషయం పోలీస్ స్టేషన్కు చేరింది. చివరకు డీఎన్ఏ టెస్ట్ చేసి నిర్ధారణకు రావాలని నిర్ణయించగా, పసిబిడ్డలిద్దరినీ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఘటనపై కలెక్టర్ భారతీ హోళికేరి సీరియస్ అయ్యారు. వెంటనే నివేదికివ్వాలని అధికారులను ఆదేశించారు.
-మంచిర్యాల, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల ప్రతినిధి, (నమస్తే తెలంగాణ)/ మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 28 : నవ మాసాలు మోసిన బిడ్డలకు జన్మనిచ్చిన ఇద్దరు తల్లులకు తమ పేగుబంధం ఎవరో తెలియకుండా పోయింది. తొలిచూరు ఆడపిల్ల పుట్టింది.. ఈ సారి మగ పిల్లాడు (వారసుడు) పుడుతాడేమోనని ఎదురుచూస్తున్న ఆ పిల్లల తండ్రులకు తలనొప్పే మిగిలింది. దవాఖాన సిబ్బంది చేసిన తప్పుతో ఎవరికి మగ పిల్లాడు పుట్టాడో? ఎవరికి ఆడపిల్ల పుట్టిందో? తెలియకుండా పోయింది.
మంచిర్యాల ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకొచ్చింది. ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులకు మగ పిల్లాడు పుట్టాడని చెప్పి పిల్లాడిని అప్పగించారు. 24 గంటల్లోపు వ్యాక్సిన్ వేయించాలని చెప్పడంతో ఆయన వ్యాక్సిన్ వేయించుకొని వచ్చాడు. తీరా తిరిగి వచ్చాక ‘నీకు పుట్టింది మగ పిల్లాడు కాదు.. ఆడపిల్ల’ అని సిబ్బంది చెప్పారు. దీనికి ఆయన ఒప్పుకోలేదు. బాబును ఇచ్చి.. ఆడపిల్ల అంటారేంటంటూ సిబ్బందిని నిలదీశాడు.
బాబు ఎవరికి పుట్టాడు..?
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రవిచంద్ర కాలనీకి చెందిన బొల్లం పావని డెలివరీ కోసం మంగళవారం మధ్యాహ్నం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. పావనిది ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్(రేర్) కావడంతో రక్తం తెచ్చుకుంటేనే ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె భర్త సాయికుమార్ రక్తం కోసం బ్లడ్ బ్యాంక్కు వెళ్లారు. ఆ సమయంలోనే పావనిని ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిన వైద్యులు డెలివరీ చేశారు. మగ పిల్లాడు పుట్టాడని ఆమెకు చూపించారు. ఇదే సమయానికి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం, రొయ్యల పల్లికి చెందిన దుర్గ మమత కూడా డెలివరీ అయ్యింది. ఆమెకు కూడా ‘నీకు బాబు పుట్టాడు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలా?’ అని అడిగారు. దానికి ఆమె ఒప్పుకోవడంతో ఆపరేషన్ కూడా చేశారు.
పిల్లాడిని బయటికి తీసుకొచ్చిన సిబ్బంది.. మమత భర్త రమేశ్కు బాబును అప్పగించారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఆయన వెళ్లి వ్యాక్సిన్ వేయించుకొని వచ్చాక ‘మీకు బాబు పుట్టలేదు.. పాప పుట్టింది’ అని చేతిలోని బాబును తీసుకున్నారు. ఈ విషయంలో సిబ్బందికి, రమేశ్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య పెద్దది అవుతుందేమోనని పిల్లలను తీసుకెళ్లి వైద్యశాల ఐసీయూలో ఉంచారు. అటు పావనికి మగ పిల్లాడు పుట్టాడని చూపించి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు. ఇటు మమత బంధువులకు కూడా మగ పిల్లాడు పుట్టాడని చెప్పి ఆమెకు కూడా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు. దీంతో వివాదం పెద్దదైంది. ఇరు కుటుంబాలు ‘మాకు బాబు పు ట్టాడంటే.. మాకు బాబు పుట్టాడు’ అంటూ వాదనలకు దిగారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
డీఎన్ఏ టెస్ట్ తర్వాతే క్లారిటీ..
వాస్తవానికి ఇద్దరిలో ఎవరో ఒకరికి బాబు, మరొకరి పాప పుట్టారు. దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యంతో పిల్లలు తారుమారయ్యారు. ఇద్దరికీ బాబు పుట్టాడని చెప్పి.. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడం ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. బాబు చేతికి బేబీ ఆఫ్ మమత ట్యాగ్ వేశారని ఆమె భర్త రమేశ్, తన భార్య పావనికి పుట్టిన బాబును సైతం చూపించారని ఆమె భర్త సాయికుమార్ చెప్తున్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. దీంతో పుట్టిన పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించి, నిర్ధారణకు వచ్చాకే పిల్లలను అప్పగించాలని నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఇద్దరి పిల్లలను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు.
విషయం తెలుసుకున్న కలెక్టర్ భారతీ హోళికేరి దవాఖాన అధికారులను పిలిపించుకొని సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. డీఎన్ఏ రిపోర్ట్ రావడానికి 15 రోజుల సమయం పట్టనుండగా, ఆ తర్వాతే పిల్లల విషయంలో క్లారిటీ రానుంది.