ఇచ్చోడ(సిరికొండ), ఆగస్టు 3: ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ల బృందాల పర్యటన విజయవంతమైంది. వారం పాటు ఒక బృందం సిరికొండ మండలం రిమ్మ, మరో బృందం ఇచ్చోడ మండలం మేడిగూడకు చేరుకున్నది. సభ్యులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరాతీశారు. గిరిపుత్రులతో మమేకమై వారి జీవన విధానం, సంస్కృతీ సాంప్రదాయాలపై అధ్యయనం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. శిక్షణ సివిల్ సర్వేంట్లు ఎదుర్కొన్న అనుభవాలు, విశేషాలతో డాక్యుమెంటరీని రూపొందించారు.
ఈ ఫిల్డ్ ట్రిప్లో అనేక సామాజిక సమస్యలు, పాలనాతీరు, పథకాలకు సంబంధించి అనేక విషయాలను తెలుసుకున్నామని చెప్పారు. సివిల్ సర్వీసెస్కు ఎంపికైన వారికి ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి అధ్యయనానికి పంపుతారు. ఈ క్రమంలో వివిధ రాష్ర్టాలకు చెందిన 14 మంది సివిల్ సర్వీసెస్ అధికారులు ఆగస్టు 26వ తేదీన ఆదిలాబాద్కు చేరుకొని కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్తో సమావేశమయ్యారు. తర్వాత ఏడుగురు చొప్పున రెండు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక బృందం సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామానికి, మరో బృందం ఇచ్చోడ మండలం మేడిగూడ గ్రామానికి చేరుకున్నారు. వారు ఈ నెల 3వ తేదీ వరకు ఆదివాసీ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధ్యయనం చేశారు.
ఆదివాసులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, గ్రామీణ జీవన విధానం, జీవనోపాధి, గిరిజనులు, ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతు రుణమాఫీ, ఆసరా పింఛన్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, బియ్యంపై రాయితీ, గొర్రెల పంపిణీ, పోడు భూముల పట్టాలు, రైతుబీమా, విద్యుత్ రాయితీతో పాటు పలు అంశాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో పర్యటిస్తూ అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లు, పాఠశాల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు.
గ్రామాల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన వైకుంఠధామం, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, హరితహారంలోని మొక్కలు, పల్లె పార్కులు, గ్రీన్ యార్డును పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ఆదివాసులు పండించే పంటలను పరిశీలించి వారు చేసే వ్యవసాయ విధానాన్ని ఫొటోలు, వీడియోలు తీసుకొని డాక్యుమెంట్ చేసి భద్రపరుచుకున్నారు. వీటి వివరాలు టీం లీడర్ ఆధ్వర్యంలో కలెక్టర్, ఐటీడీఏ పీవో, లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ, ఎల్బీఎస్ఎన్డబ్ల్యూఏలో చేసిన అధ్యయనం గురించి వారికి వివరిస్తారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేయడంతో తమకు భవిష్యత్లో చాలా ఉపయోగపడుతుందని వివిధ రాష్ర్టాల శిక్షణ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం సభ్యులు చెబుతున్నారు. ఆదివాసీ జీవన విధానం ప్రభుత్వ పథకాల అమలు అంశాలపై వారి అభిప్రాయాలను ‘ నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
ప్రభుత్వ పథకాలపై అధ్యయనం
మేము 14 మందితో రెండు బృందాలుగా ఏర్పడి ఆదివాసీ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అధ్యయనం చేశాం. ఆదివాసుల సంస్కృతీ, సంప్రదాయాలు, జీవన శైలి, జీవనోపాధి తెలుసుకున్నాం. ఇక్కడున్న గ్రామంలో పర్యటిస్తూ పలు సమస్యలపై అధ్యయనం చేశాం.
– జస్కరణ్ సింగ్, ట్రైనీ ఐఆర్ఎస్, పంజాబ్
క్షేత్రస్థాయి అధ్యయనంతో ఉపయోగం
క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల్లో వారం రోజుల పాటు పర్యటించడంతో పలు సమస్యలు, అభివృద్ధి పనులపై ఆరా తీశాం. అభివృద్ధి, సమస్యలను మేము ఫొటోలు, వీడియోలు రికార్డు చేసుకొని డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం. ఈ క్షేత్రస్థాయి అధ్యయనం సమస్యలు, అభివృద్ధిపై చర్చించుకోవడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది.
– కావ్యసీ, ట్రైనీ ఐఏఎస్, తమిళనాడు
ఆదివాసీ సంస్కృతి చాలా గొప్పది
మేము క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలు, వారు ఉండే విధానం చాలా గొప్పగా ఉన్నాయి. ఈ అభివృద్ధి కాలంలో వ్యవసాయం చేసే విధానం బాగుంది. ఆధునికయుగంలో రసాయనిక ఎరువులు, మందులు వాడుతుంటే ఆదివాసుల్లో ఎక్కువ శాతం సేంద్రియ ఎరువులతోనే పంటలు సాగు చేస్తున్నారు. ఆదివాసులు ఏ స్థాయికి ఎదిగిన వారు గుస్సాడీ నృత్యం, వాయిద్యాలు ఇప్పటికే అలాగే ఉన్నాయి.
– ఔతులా ఓజుకోమే, ట్రైనీ ఐపీఎస్, నాగాలాండ్
అధ్యయనం గురించి వివరిస్తాం
ఆదివాసీ గ్రామాల్లో వారి జీవనోపాధి, సంస్కృతీ సంప్రదాయాలు, ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశాం. వీటి వివరాలు టీం లీడర్ ఆధ్వర్యంలో కలెక్టర్, పీవో, లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ, ఎల్బీఎస్ఎన్డబ్ల్యూఏలో చేసిన అధ్యయనం గురించి వారికి వివరిస్తాం. ఆదివాసీ గ్రామాల్లో గ్రామాలకు రావడం మొదటిసారి. ఇక్కడ ఆదివాసులు చాలా ప్రేమాభిమానాలు చూపించారు.
– ప్రాంశు శర్మ, ట్రైనీ ఐఎస్ఎస్, హర్యానా