నిర్మల్ అర్బన్, డిసెంబర్ 15 : నిర్మల్లోని బంగల్పేట్ శివారులో రూ.2.65 కోట్ల నిధులతో నిర్మించిన మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు గురువారం ముగిశాయి. చివరి రోజు హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. నిర్మల్ జిల్లాను ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇందుకోసం అనేక ఆలయాలను నిర్మించినట్లు గుర్తు చేశారు.
యాదాద్రి తరహాలో పూర్తి కృష్ణ శిలతో ఆలయాన్ని నిర్మించామని వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన వారు ఎన్నికల్లో తిరిగి గెలుపొందలేదని, తాను చరిత్రను తిరగరాశానని చెప్పారు. అమ్మవారి దయతో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. గడువుకు ముందుగానే ఆలయాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, జైపాల్ రెడ్డిని అభినందించారు. శాంతినగర్ నటరాజ్మిల్ నుంచి బంగల్పేట్ వరకు రూ.28 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం మంత్రి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు మంత్రి దంపతులు హంపీ పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకున్నారు.
పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు
అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు పట్టణంతో పాటు సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి-వినోదమ్మ, ఆలయ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు.