రాష్ట్ర సర్కారు మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఇందులో భాగంగా బలగల గ్రామంలో రూ.36 కోట్లతో బాయ్స్-1, బాయ్స్-2 విద్యాలయాలను నెలకొల్పి సకల సౌకర్యాలు కల్పించింది. కార్పొరేట్కు దీటుగా ఆంగ్ల బోధన అందిస్తూనే పౌష్టికాహారం పెడుతున్నది. ఒక్కో విద్యార్థికి రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తూ, వారి భవిష్యత్కు భరోసానిస్తున్నది. ఆయా చోట్ల గతేడాది పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో 90 శాతానికి పైగా ఫలితాలు రాగా, ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇక ఈ విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా, ఈ నెల 15వ తేదీ వరకు గడువు విధించింది. కాగా, ప్రభుత్వం నిర్మిస్తున్న గురుకులాలు తమకు వరంగా మారాయన్న అభిప్రాయం ఆ వర్గంలో వ్యక్తమవుతున్నది.
కాగజ్నగర్, ఫిబ్రవరి 9 : మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు సర్కారు కృషి చేస్తున్నది. ఈ మేరకు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బలగల గ్రామంలో బాయ్స్-1, బాయ్స్-2 గురుకులాలు ఏర్పాటు చేసింది. అలాగే ఆసిఫాబాద్ మండలంలో సొంత భవనానికి ఇటీవల నిధులు మంజూరయ్యాయి. అధికారులు స్థల సేకరణలో నిమగ్నమయ్యారు.
కాగజ్నగర్ మండలం బలగల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకులాలు బాయ్స్-1, బాయ్స్-2 ఏర్పాటు చేసింది. ఒక్కో మైనార్టీ గురుకులానికి రూ. 18 కోట్లు కేటాయించింది. అత్యాధునికంగా భవనాలు నిర్మించింది. భోజనశాల, వంటశాల, ప్రిన్సిపాల్, సిబ్బందికి క్వార్టర్స్, వేడి నీళ్ల కోసం గ్రీజర్లు, తాగునీటి కోసం శుద్ధ జల ప్లాంటుతో పాటు సకల సౌకర్యాలు కల్పించింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. త్వరలో కంప్యూటర్స్ అందించనున్నది.
ప్రస్తుతం బాయ్స్-1లో 416, బాయ్స్-2లో 401 మంది విద్యార్థులు చదువుతున్నా రు. బాయ్స్-1లో ఎనిమిది మంది జూనియర్ లెక్చరర్లు, 26 మంది టీచింగ్, 10 మంది నాన్ టీచింగ్, బాయ్స్-2లో ఎడుగురు జూనియర్ లెర్చరర్లు, 21 మంది టీచింగ్ సిబ్బంది, 8 మంది నాన్ టీచింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మైనార్టీ గురుకుల విద్యాలయం బాయ్స్-1లో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 95 శాతం, ఇంటర్లో 98 శాతం ఫలితాలు వచ్చాయి. బాయ్స్-2లో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్లో 89 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు ఉచితంగా అందిస్తూ కార్పొరేట్కు దీటుగా వసతులు కల్పించారు. ఆంగ్ల బోధనతోపాటు పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధజలం అందిస్తున్నారు. ప్రతిరోజూ పాలు, గుడ్లు, పండ్లు, వారానికోసారి చికెన్ ఇస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. లక్షకుపైగా ఖర్చు చేస్తున్నారు.
మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మూడు నెలలకోసారి కాస్మోటిక్ కిట్ అందిస్తున్నారు. ఆ కిట్లో తల నూనె, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, సబ్బులు, దువ్వెన తదితర సామగ్రి ఉంటుంది. అంతేగాకుండా రెండు జతల యునిఫాంలు, షూ, టెక్స్ బుక్స్, నోట్ బుక్స్ ఉచితంగా అందించడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఒక్కో గురుకులంలో 80 ఖాళీలు ఉండగా, ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు విధించింది. అర్హులైన మైనార్టీ, నాన్ మైనార్టీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఒక్కపైసా ఖర్చులేకుండా నాణ్యమైన విద్య అందుతుండడంతో ఏటా గురుకులాల్లో ప్రవేశాల కోసం పోటీ పెరుగుతున్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన తెలంగాణ మైనార్టీ గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి. అనుభజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందిస్తున్నాం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మైనార్టీ గురుకులాలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు చూడకుండా మైనార్టీ గురుకులాల్లో ప్రవేశం పొందాలి. త్వరలో కంప్యూటర్ విద్య కూడా ప్రారంభిస్తాం.
– జబ్బార్, మైనార్టీ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్, కాగజ్నగర్