ఎదులాపురం,జనవరి 30 : దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు ఎన్న డూ మరువలేనని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు రెండు నిమిషాల మౌనం పాటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఏటా జనవరి 30న దేశమంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పిస్తూ ఉంటారని కొనియాడారు. అమర వీరులను స్మరించుకోవడం దేశపౌరుల బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో ఏవో మహమ్మద్ యూనుస్ అలీ, పర్యవేక్షకులు ఎంఏ జోసెఫిన్, గంగాధర్, ఎంటీవో ఎం శ్రీపాల్, ఫింగర్ ప్రింట్ నిపుణులు శ్రీనివాస్, సెక్షన్ అధికారులు టీ మురళీమోహన్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ, ఐటీ కోర్, డీసీఆర్బీ సీఐ, ఎస్ఐ ఉన్నారు.