జ్వరమొచ్చినా.. నొప్పొచ్చినా.. ఏ ఇబ్బంది కలిగినా దవాఖానలో చేర్చాలంటే మంచం, జోలెలో వేసుకొని ముందు ఇద్దరు, వెనకాల ఇద్దరు తీసుకెళ్లే దుస్థితి. రాళ్లు, రప్పలు.. మోకాలులోతు బురద.. అడుగుతీసి, అడుగు వేయలేకుండా ఉన్న అడవి మార్గం గుండా మైళ్లదూరం వెళ్లాల్సిన పరిస్థితి. ఇగ..గర్భిణుల బాధలు, గాధలు వర్ణణాతీతం. కొండలు, కోనలు, గుట్టల మార్గం గుండా తీసుకెళ్లంగ.. మార్గం మధ్యలోనే పురిటినొప్పులు రావడం జరిగేది. గర్భిణులు చనిపోవడం లేదా పుట్టిన పిల్లలైనా మృతిచెందడం సాధారణం. పామో, తేలో కరిచి ప్రాణం విషమించితే ఆశలు వదులుకోవాల్సిందే..! అటువంటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాలకు తెలంగాణ సర్కారు బీటీ రోడ్డు మంజూరు చేసింది. కానీ.. వన్యప్రాణుల సంరక్షణ, ఇతర కారణాలతో అటవీశాఖ నుంచి అనుమతులు రాలేదు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చొరవతో అటవీ మార్గంలో రోంపల్లి నుంచి గుండాల వరకు దాదాపు ఏడు కిలోమీటర్లు మట్టిరోడ్డు నిర్మించారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ గుండాలలోని గూడేవాసులతో మాట్లాడి అందిస్తున్న ప్రత్యేక కథనం..
– మంచిర్యాల, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రోడ్డులేక.. 40 కిలోమీటర్లు తిరిగిపోయేటోళ్లం..
నా పేరు పంద్రం రాము. మాది తిర్యాణి మండల కేంద్రం. గుండాల మా అత్తగారు. ఇల్లరికం అచ్చిన. పండుగకో, పబ్బానికో మా ఊరు పోవాలంటే 40 కిలోమీటర్లు తిరిగిపోవాలి. గంటన్నర సమయం పట్టేది. గిప్పుడు అర్ధగంటలో పోయస్తన్న. మా వ్యవసాయ ట్రాక్టర్ తిర్యాణికి పనికిపోయింది. నా భార్యా పిల్లలను మా అమ్మ దగ్గరికి తీసుకుపోతన్న. ఈ రోడ్డు ఎప్పుడో పడుంటే అసలు ఇల్లరికమే వచ్చేటోడిని కాదు. రోడ్డేసి సర్కారోళ్లు మంచిపని చేసిండ్రు. లేకపోతే ఎన్ని రోజులైనా ఇబ్బందులు పడేటోళ్లం.
నాటి చిత్రం.. గుండాల గ్రామ పంచాయతీ పరిధిలోని రాజగూడ, చిట్లగూడ, పూర్ణగూడ, గుడివాడగూడ, అర్జుగూడ, దొడ్డిగూడ, దాబగూడ అనే ఏడు గూడేలు వెళ్లేందుకు రాళ్లు, రప్పలతో కూడిన రోడ్డు. ఈ గూడేల నుంచి తిర్యాణి మండల కేంద్రానికి కాలినడకన 18 కిలోమీటర్లను నాలుగు గంటలు అడవిలో నడుచుకుంటూ వెళ్లాలి.
నేటి చిత్రం.. గుండాల నుంచి రోంపల్లి మీదుగా తిర్యాణి మండల కేంద్రానికి వెళ్లే రహదారి. ఈ రాళ్లురప్పలతో కూడిన రహదారికి సర్కారు రూ.50 లక్షలు మంజూరు చేసింది. అటవీశాఖ అనుమ తులు రాకపోవడంతో రోడ్డు నిర్మాణం ఆలస్యమవుతున్నది. దీంతో పోలీసుశాఖ, ప్రజలు కలిసి ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించా రు. ఇప్పుడు వాహనాలపై గుండాలవాసులు దర్జాగా వెళ్తున్నారు.
రాళ్లను తొలచి.. రోడ్డు నిర్మించి..
గుండాలవాసులు పడుతున్న రహదారి కష్టాలను చూసి కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ చలించిపోయారు. ఏదేమైనా ఆ గ్రామానికి రోడ్డు వేయాలని నిర్ణయించుకుని, ఇంజినీర్లను పిలిపించారు. రోంపల్లి నుంచి గుండాలకు రోడ్డు వేయడానికి సర్వే చేయించారు. పెద్దపెద్ద రాళ్లను తొలగించడానికి, గుట్టలను దాటుకుంటూ మట్టిని లేయర్లుగా పోయడానికి, రోడ్డు వేయడానికి రూ.50 లక్షలు అవుతుందని అంచనాకు వచ్చారు. ఇందుకోసం సింగరేణి వద్ద ఉన్న అధునాతన యంత్ర పరికరాలు కావాలని సూచించారు. సింగరేణి యాజమాన్యానికి ఎస్పీ సురేశ్ విన్నవించడంతో కేవలం 20 రోజుల వ్యవధిలోనే అధునాతనమైన రోడ్డు నిర్మితమైంది. ఎస్పీతోపాటు స్థానిక పోలీసు సిబ్బంది, ఆయా గూడేలవాసులు స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. రోడ్డు మార్గంలో రెండు, మూడు ఘాట్స్, గుండాల జలపాతం కనువిందు చేయనుండగా.. ఇవీ ఈ రోడ్డు మార్గానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.
త్వరలోనే పక్కా రోడ్డు..
“ఈ మార్గంలో పక్కా రోడ్డు మంజూరైంది. అటవీశాఖ అనుమతులు లేక అగిపోయినా.. రోడ్డయితే వచ్చింది. ఇప్పటికే మట్టి రోడ్డు ఉన్న దృష్ట్యా అటవీ శాఖ కూడా పక్కా రోడ్డుకు అనుమతి ఇవ్వొచ్చు. అదే జరిగితే మా దశాబ్దాల కల నెరవేరుతుందని” ఆయా గూడేంవాసులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు అందుబాటులోకి వస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీసింది. పంద్రం రాము మాట్లాడుతూ.. మాది తిర్యాణి. గుండాల మా అత్తగారూరు. ఇల్లరికం అచ్చిన. పండుగకో, పబ్బానికో మా ఊరు పోవాలంటే 40 కిలోమీటర్లు తిరిగిపోవాలి. గిప్పుడు అర్ధగంటలో పోయస్తున్నా. మా వ్యవసాయ ట్రాక్టర్ తిర్యాణికి పనికిపోయింది. నా భార్యా పిల్లలను మా అమ్మ దగ్గరికి తీసుకుపోతన్న. ఈ రోడ్డు ఎప్పుడో పడుంటే అసలు ఇల్లరికమే వచ్చేటోడిని కాదు. అని చెప్పుకొచ్చాడు. కుడిమేత లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏదైనా పని మీద మండల కేంద్రానికి పోవాలంటే అడవిలో పడి నడుచుకుంటూ పోయేటోళ్లం. గిప్పుడు రోడ్డు అచ్చి చాలా మంచిచేసింది. గంట సేపటిలో పోయిరాగలుగుతున్నాం.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని మారుమూల అడవి ప్రాంతంలో గల గుట్టలపై గుండాల గ్రామం ఉంది. ఈ పంచాయతీ పరిధిలో రాజగూడ, చిట్లగూడ, పూర్ణగూడ, గుడివాడగూడ, అర్జుగూడ, దొడ్డిగూడ, దాబగూడ అనే ఏడు గూడేలు ఉన్నాయి. ఈ గూడేల నుంచి మండల కేంద్రానికి వెళ్లడానికి ఎలాంటి దారిలేదు. కాలినడకన నాలుగు గంటలు అడవిలో నడుచుకుంటూ వెళ్లాలి. ఒకవేళ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మంగీ మీదుగా 35-40 కిలోమీటర్లు ప్రయాణిస్తే తిర్యాణి చేరుకోవచ్చు. మండల కార్యాలయాలకు వెళ్లాలన్నా, రేషన్ బియ్యం కావాలన్నా, పండించిన పంట అమ్ముకోవాలన్నా ఒక్క రోజులో పూర్తికాక అవస్థలు పడే దుస్థితి ఉండేది. ప్రస్తుతం రోంపల్లి నుంచి వేసిన రోడ్డు ద్వారా 18 కిలోమీటర్లు వెళ్తే తిర్యాణి చేసుకోవచ్చు. ఇందులో ఏడు కిలోమీటర్లు బాగా లేకపోవడంతో రోడ్డు నిర్మించారు. ఏం కావాలన్నా 35 నిమిషాల్లో మండల కేంద్రానికి వెళ్లవచ్చు. రహదారి అందుబాటులోకి రావడంతో అంబులెన్స్ కూడా వెళ్తున్నది. ఫలితంగా గూడెంవాసులు సంబురపడి పోతున్నారు.
– మంచిర్యాల, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రోడ్డును ఉపయోగించుకోవాలి..
రోడ్డు లేదని బాధ పడ్డ గుండాలవాసుల కష్టం తీర్చాలనే ఉద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకొని మట్టిరోడ్డు వేశాం. క్వాలి టీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. వచ్చిన రోడ్డును గుండాల అభివృద్ధి కోసం సరిగా ఉపయోగించుకోవాలి. పనులకు వెళ్లేందుకు, పంట విక్రయానికి తీసుకెళ్లేందుకు, పిల్లలకు మంచి విద్య కోసం పొరుగు ఊర్లకు పంపేందుకు ఈ రోడ్డు ఎంతో అవసరమని గ్రామస్తులు చెప్పినప్పుడు ఆనందం వేసింది. ఈ రోడ్డుతో ఓ మంచి పని చేశామనే సంతృప్తి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
– కే సురేశ్కుమార్, ఎస్పీ, కుమ్రం భీం ఆసిఫాబాద్.
పనులకు పోతున్నాం..
ఇక్కడున్న గూడేలు పూర్తిగా వ్యవసాయ ఆధారితమే. బయటికి వెళ్తే ఆ రోజు వస్తామో రామో అని అత్యవసరం అయితే తప్ప వేరే ఊరుకి పోం. ఇప్పుడు ఈ రోడ్డు రావడంతో వ్యవసాయం చేసుకుంటూ బయటికి వెళ్లి వేరే ఏదైనా పని కూడా చేసుకుంటున్నాం. సరైన వసతులు లేక మా పిల్లలను బడికి కూడా పంపేటోళ్లం కాదు. ఇప్పుడు తిర్యాణి అవసరమైన తాండూరు దాకా పోవచ్చు. మంచి పని చేసిన పోలీసులకు రుణపడి ఉంటాం.
– కనక బాజీరావు, గుండాల, తిర్యాణి మండలం.