ఆదిలాబాద్, జూన్ 3 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, సింగరేణి, భైంసా లాంటి ప్రాంతాల్లో శాంతిభద్రతలు పోలీసులకు సవాల్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జిల్లాలో ప్రజల రక్షణతో పాటు, శాంతిభద్రతలను పరిరక్షించడంలో పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచడం, అధికారులు, సిబ్బంది నియామకం చేపట్టడంతో పాటు, పట్టణాలు, గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగినా కేసుల పరిష్కారానికి సీసీ కెమరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీసీ కెమరాల నిర్వహణలో భాగంగా జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూంలు నెలకొల్పింది. పోలీసు అధికారులకు, పోలీస్ స్టేషన్లకు, సిబ్బందికి, బ్లూ కోర్ట్ సిబ్బందికి వాహనాలను సమకూర్చింది. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, ప్రజలకు ఇతర సమస్యలు వచ్చినా డయల్-100 సిబ్బంది క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని సేవలు అందిస్తున్నారు. విద్యార్థినులు, మహిళల సంరక్షణకు సైతం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా షీం టీంలను ఏర్పాటు చేసింది. షీ టీం బృందాలు మహిళలకు అవగాహన కార్యాక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు గుట్కా అక్రమ రవాణా అవుతుండగా, ఈ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, కూడళ్లను విస్తరించడంతో పాటు, సీసీ కెమరాలు ఏర్పాటు చేసింది. మట్కా, జూదం కారణంగా పలు కుటుంబాలు వీధిన పడుతున్నాయి. వీటిపై సైతం పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిర్వాహకులతో పాటు, అడుతున్న వారిపైనా చర్యలు తీసుకున్నారు. పోలీసులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతలను కాపాడడంలో ముందుంటున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో 350 సీసీ కెమరాలు.., మంచిర్యాల జిల్లాలో కమిషనరేట్ పరిధితో పాటు ప్రతి గ్రామంలో 2 కెమరాల చొప్పున కమ్యూనిటీ కెమరాలతో కలిపి 6,441.., నిర్మల్ జిల్లాలో పోలీసు శాఖతో పాటు, కమ్యూనిటీ కెమెరాలతో కలిపి 8,592.., కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండూ కలిపి 5,411 కెమరాలను ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలోని భీమారం, మంచిర్యాల ట్రాఫిక్, కన్నెపల్లి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కాగా.., ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ, భీంపూర్, సిరికొండ, మావల పోలీస్స్టేషన్లను ప్రారంభించారు. నిర్మల్లో దస్తురాబాద్, దిలావర్పూర్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశారు. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండేసీ షీ టీం బృందాలు ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో 2014 కంటే ముందు పోలీసు అధికారులకు, సిబ్బందికి 94 వాహనాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 553 ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో 37 ఉండగా ప్రస్తుతం 241 వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సైతం పోలీసు అధికారులు, సిబ్బందికి వాహనాలు అందించింది.
జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న పోలీసులు.. సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్నారు. వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహించినప్పుడు ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వం భారీగా పోలీసు నియామకాలను చేపట్టగా,. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. వివిధ ప్రైవేటు కంపెనీల్లో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు గ్రామాల్లో జాబ్మేళా నిర్వహిస్తున్నారు. చలికాలంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో గడిచిన తొమ్మిదేళ్లలో 1,245 మంది సివిల్ పోలీసులను, 518 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు.., 38 మంతి మినిస్ట్రియల్ సిబ్బంది నియామకం చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో 2015లో 138 మంది సివిల్(107 మంది పురుషులు, 31 మంది మహిళలు).., 139 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు(121 మంది పురుషులు, 18 మంది మహిళలు).., 2018లో 268 మంది సివిల్ (172 మంది పురుషులు, 96 మంది మహిళలు).., 82 మంది ఏఆర్ కానిస్టేబుళ్ల (63 మంది పురుషులు, 19 మంది మహిళలు)ను ప్రభుత్వం నియమించింది. 2022లో చేపట్టిన 149 సివిల్, 85 ఏఆర్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ చివరిదశకు చేరుకున్నది. నిర్మల్ జిల్లాలో గడిచిన తొమ్మిదేళ్లలో 19 మంది ఎస్ఐలు, 218 మంది కానిస్టేబుళ్ల నియామకం పూర్తయ్యింది. మ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 150 మంది వరకు పోలీసుల నియామకం చేపట్టారు.