గురువారం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు చోటివ్వకపోవడంపై కేడర్లో అసహనం వ్యక్తమవుతున్నది. ముగ్గురు సీనియర్ నేతలైన వినోద్, వివేక్, ప్రేమ్సాగర్రావులలో.. ఇద్దరికి కచ్చితంగా మంత్రి పదవులు ఇస్తారన్న చర్చ సాగగా, చివరికి హ్యాండివ్వడం హాట్ టాపిక్గా మారింది. గతంలో మినిస్టర్గా పనిచేసి పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత ఏకంగా ఢిల్లీకి పోయి పైరవీ చేసినా పరిగణలోకి తీసుకోలేదన్న ప్రచారం జరుగుతున్నది. హేమాహేమీలుగా పేరొందిన వీరిని విస్మరించడం ఏమిటన్నది ఆయా వర్గాల్లో మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. పోనీ.. రెండో విడుత మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశమిస్తారనుకుంటే.. అది ఉంటుందో లేదోనని వారంతా మదనపడుతున్నట్లు తెలుస్తున్నది.
– మంచిర్యాల, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
Congress | మంచిర్యాల, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకులెవ్వరికీ మంత్రి పదవి దక్కలేదు. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈ నలుగురిలో ముగ్గురు సీనియర్ నాయకులు ఉండగా, వీరిలో ఇద్దరికి కచ్చితంగా మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది.
ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరుక్షణమే కొందరు మా సారు.. మంత్రంటే.. మా సారు మంత్రంటూ.. ఇంకొందరైతే ఒకడుగు ముందుకేసి మా సారు డిప్యూటీ సీఎం అంటూ.. తెగ ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం, రాష్ట్రంలోని నాయకత్వం ఉమ్మడి జిల్లా నాయకులకు మంత్రి పదవి విషయంలో హ్యాండ్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న ఆ సీనియర్ నాయకుల ఆశలు గల్లంతయ్యాయి. గతంలో మంత్రిగా పని చేసి పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత ఏకంగా ఢిల్లీకి పోయి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిసి పైరవీ చేయించుకున్నట్లు తెలిసింది. అంత చేసినా మంత్రివర్గంలో ఆయనకు చోటుదక్కకపోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు (పీఎస్సార్) జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్నారు. దీంతో ఈ గవర్నమెంట్లో ఆయనకు మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని అంతా భావించారు. మరోవైపు బెల్లంపల్లి నుంచి గెలిచిన గడ్డం వినోద్ లేదా చెన్నూర్ నుంచి గెలిచిన ఆయన తమ్ముడు గడ్డం వివేక్లలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. మంత్రి పదవి, పెద్దపల్లి ఎంపీ సీటు ఇస్తారనే హామీతోనే గడ్డం వివేక్ పార్టీలో చేరినట్లు తీవ్రమైన చర్చ నడిచింది. ఒక దశలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య మంత్రి పదవి కోసం పోటీ నెలకొనడంతో పీఎస్సార్కు ఇవ్వకున్నా వీరిద్దరిలో ఎవరికో ఒకరికి కచ్చితంగా పదవి వస్తుందని అందరూ భావించారు.
కానీ కొత్త కేబినేట్లో వీరెవ్వరూ లేకపోవడంపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కేడర్ అసహనం వ్యక్తం చేస్తున్నది. ఓ ఎమ్మెల్యే అయితే తాను గెలిస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నా తానే మినిస్టర్ అని చెప్పుకున్నారు. తీరా ఇప్పుడు మంత్రివర్గంలో ఆయన పేరే లేకుండా పోయింది. దీంతో ఆయన మంత్రి అవుతారనే ఆశతో కాంగ్రెస్ పార్టీలో చేరిన సెకండ్ క్యాడర్ అయోమయంలో పడిపోతున్నది. మిగిలిన జిల్లాలకు మంత్రి పదవులు ఇచ్చి.. ఆదిలాబాద్కు మాత్రం అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భౌగోళికంగా, గత పాలనను చూసుకున్నా ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కరూ లేదా ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలి. అది కుదరని పక్షంలో ఒకరికి మంత్రిపదవి, ఒకరికి ప్రభుత్వ విప్ హోదా కల్పించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవేవీ లెక్కలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మంత్రి వర్గాన్ని విస్తరించి, ఆదిలాబాద్ జిల్లాను చిన్నచూపు చూసిందనే చర్చ నడుస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఇద్దరేసి ఎమ్మెల్యేల చొప్పున మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఆదిలాబాద్ నుంచి ఏ ఒక్కరికీ ఇవ్వలేదు.
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి నాయకులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉమ్మడి జిల్లాలో హేమాహేమీలుగా పేరొందిన నాయకులను విస్మరించడం ఏమిటనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఏర్పాటు చేసిన తొలి సభను, భట్టి పాదయాద్రను విజయవంతం చేసినా మా నాయకులను పరిగణలోకి తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి నాయకులు నారాజ్ అవుతున్నారు. పోనీ రెండో విడుత మంత్రి వర్గ విస్తరణలోనైనా చోటు దక్కిస్తారో చూద్దామనుకుంటే… ఒకవేళ రెండో విడుత మంత్రివర్గ విస్తరణ లేకుంటే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మింగలేక కక్కలేక జుట్లు పీక్కుంటున్నారు.