నిర్మల్ టౌన్, జనవరి 28 : జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను పక్కగా కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన సేవలందించి, దృష్టిలోపాలు ఉన్న వారికి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
వైద్య బృందం సభ్యులు సమయపాలన పాటించి, అర్హులైన వారికి అవసరమైన కంటి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఇప్పటి వరకు 24,546 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఇందులో 4,605 మందికి కళ్లద్దాలు ఇచ్చినట్లు వివరించారు. మిగతా వారికి త్వరలో అద్దాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.