జాతీయ రహదారుల నిర్మాణం పేరిట కేంద్ర సర్కారు ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నది. రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, భూములు కోల్పోతున్న వారి బతుకులను ఆగం చేస్తున్నది. మంచిర్యాల జిల్లా మీదుగా నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి-63తో హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఇండ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాలతో పాటు వ్యవసాయ భూములను సైతం కోల్పోవాల్సి వస్తుండగా, ఆయా వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం.. పరిహారం మాటెత్తకుండా ఓ వైపు అధికంగా, మరోవైపు కొద్దిగా భూ సేకరణ చేయడంపై నిరసన వ్యక్తమవుతున్నది. పూర్తిస్థాయి స్పష్టత ఇచ్చే వరకూ సర్వేను అడ్డుకుంటామని, న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదంటూ బాధితులు తెగేసి చెబుతున్నారు.
మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హాజీపూర్, మే 11 : మంచిర్యాల జిల్లా మీదుగా నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి-63తో స్థానికుల బతుకులు ఆగం అవుతున్నాయి. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద ఇళ్లు కోల్పోగా, మంచిర్యాల పక్కనున్న వేంపల్లి, ముల్కల్లలో రహదారి పక్కన ఇండ్లు కట్టుకున్నారు. వచ్చిన పరిహారం సరిపోకపోయినా అప్పోసప్పో చేసి ఇళ్లను నిలబెట్టుకున్నారు. కానీ.. ఇప్పుడు ఎన్హెచ్-63 విస్తరణతో మరోసారి ఇళ్లు పోతాయంటే జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ మా బతుకులతో చెలగాటం ఆడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో రోడ్డుకు ఒక్క వైపే భూ సేకరణ చేస్తుడడంతో చాలా మంది ఇండ్లను కోల్పోతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయమని, సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటూ నిలదీస్తునానరు. కొద్ది రోజులుగా ఊర్లలోనే టెంట్లు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నరు. దీంతో ఏళ్లుగా ఊరిస్తున్న ఎన్హెచ్-63 విస్తరణకు మరోసారి బ్రేకులు పడినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
తెలంగాణకు గత ప్రభుత్వాలు ఇచ్చినదానికంటే ఎక్కువ జాతీయ రహదారులు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణలో ఇండ్లు, భూములు కోల్పోతున్న బాధితులకు తీరని అన్యాయం చేస్తున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగ్దల్పూర్ వరకు జాతీయ రహదారుల సంస్థ నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులను చేపట్టేందుకు సర్వేను చేసింది. ఇందుకుగాను గత నెల 14న ఎన్హెచ్ఏఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. మంచిర్యాల జిల్లాలోని గూడెం గోదావరి బ్రిడ్జ్ నుంచి క్యాతన్పల్లి వరకు 36 కిలో మీటర్ల మేర ఏ సర్వే నంబర్లో ఎంత భూమి సేకరిస్తారో నోటిఫికేషన్లో పొందు పర్చారు. దీనికి సంబంధించిన ఓ మ్యాప్ను సైతం విడుదల చేశారు. దీని ప్రకారం లక్షెట్టిపేట పట్టణంలో బైపాస్ కాకుండా పట్టణం మధ్యలో నుంచి గుడిపేట, ముల్కల్ల వరకు రోడ్డు పోతున్నది. పైగా రోడ్డుకు ఒక వైపు అధికంగా, మరోవైపు కొద్దిగా భూ సేకరణ చేస్తున్నారు. అధికంగా భూ సేకరణ చేసే వైపు కొందరు ఇండ్లను కోల్పోవాల్సి వస్తున్నది. కాగా ఇలా ఇండ్లు కోల్పోతున్న వారికి పరిహారం ఎంతిస్తారో చెప్పకుండానే అధికారులు సర్వే చేస్తున్నారు. దీంతో బాధితులు ఇంటికి, భూమికి, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు ఏ ప్రాతిపదికన నష్ట పరిహారం ఇస్తారో చెప్పాకే సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులు సర్వేకు వచ్చిన ప్రతిసారీ అడ్డుకుంటున్నారు. గడిచిన కొన్ని రోజులుగా ముల్కల్ల, గుడిపేట గ్రామాల్లో ఇది నిత్యకృత్యంలా మారింది.
ఎన్హెచ్-63 పనులు ఇప్పటికే ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్ నుంచి కోటపల్లి, చెన్నూర్, భీమారం, జైపూర్ మీదుగా ఇందారం క్రాస్రోడ్ వరకు పూర్తయ్యాయి. అక్కడి నుంచి మొదలయ్యే మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి లక్షెట్టిపేట వరకు పనులు జరగాల్సి ఉంది. అయితే 2018లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కేతన్పల్లికి వరకు గ్రీన్ఫీల్డ్ హైవేను ప్రతిపాదించారు. మధ్యలో వచ్చే నగరాలు, పట్టణాలు, గ్రామాలకు నష్టం కలగకుండా పొలాల మీదుగా ఇది వెళ్తుంది. దీనికి సంబంధించిన అలైన్మెంట్ సైతం పూర్తయ్యింది. గ్రీన్ఫీల్డ్ హైవేతో మంచిర్యాల, క్యాతన్పల్లి మున్సిపాలిటీలతో పాటు పలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్వెంచర్లకు నష్టం జరగకుండా బడా రియల్టర్లు, కొందరు నాయకులతో ఆ భూముల్లో షేర్ల ఆశ చూపించి రద్దు చేయించారనే ప్రచారం జరుగుతుంది. అందుకే ఎవరికీ నష్టం జరగకుండా పోవాల్సిన గ్రీన్ఫీల్డ్ రహదారిని బ్రౌన్ ఫీల్డ్గా మార్చి ఊర్ల మీద నుంచి తీసుకుపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో మంచిర్యాల, హాజీపూర్ మండలాల్లోని దొనబండ, హజీపూర్, రాపల్లి, గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి గ్రామాల్లో రోడ్డు పక్కన ఉన్న ఇండ్లు అన్ని పోతున్నాయి. మిషన్ భగీరథ పైప్లైన్, ఫైబర్ నెట్ లైన్ ఉండడంతోనే రోడ్డుకు ఒకవైపు సేకరణ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. అది అసలు కారణం కాదని స్థానికులు అంటున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అప్పటి వరకు అధికారులు సర్వే చేయడానికి వీలులేదని హెచ్చరిస్తున్నారు.
ఎన్హెచ్ 63తో గుడిపేట గ్రామ ప్రజలకు అన్ని విధాలా నష్టం జరుగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైంది గుడిపేట గ్రామం. అంతకుముందు గ్రామం పూర్తిగా అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతైంది. ఇప్పుడు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణంతో కట్టుకున్న ఇండ్లు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. జాతీయ రహదారి విస్తరణలో నా ఇల్లు పూర్తిగా పోతుంది. అగ్ని ప్రమాదంలో బాధితులకు అంతంత మాత్రమే నష్ట పరిహారం అందింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూముల కోల్పోయిన మాకు ఎకరానికి రూ. 2 లక్షల పరిహారం ఇచ్చింది. జాతీయ రహదారి పక్కన పునరావాస కాలనీ ఏర్పాటు చేసి ప్లాట్లను ఇచ్చింది ప్రభుత్వం. భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించిన మార్కెట్ ధరలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. -కందుల వెంకటేశ్వర్లు, గుడిపేట
రోడ్డు పక్కన ఉన్న ఐదు గుంటల జాగా, ఇల్లు మొత్తం పోతుంది. మా కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. కోట్ల రూపాయల విలు వ చేసే స్థలం నుంచి రోడ్డు పోతుంది. మా కుటుంబానికి ఉన్న ఒక్క ఆశ ఆ భూమే. అది కూడా పోతే మేం బతికేదెలాగో అర్థం కావడం లేదు. మాకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వని పక్షంలో, మా భూమి మాకే విదిలేయాలి. అలా కాదని బలవంతం చేసి లాక్కునేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. – గుమ్మల నరసమ్మ, ముల్కల్ల
నేషనల్ హైవే అధికారులు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ నిర్మాణంతో ఎవరికీ నష్టముండదు. ఈ విధానంతో గ్రామాలు, పట్టణాల్లోని కట్టడాలు దెబ్బతినకుండా పూర్తిగా వ్యవసాయ భూముల మీదుగానే రహదారి నిర్మిస్తారు. కానీ ఇప్పుడు బ్రౌన్ ఫీల్డ్కు మార్చారు. దీనివల్ల గుడిపేట, ముల్కల్లలోని ఇండ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, వ్యవసాయ భూములు కూడా పూర్తిగా పోతున్నాయి. గతంలో ప్రకటించిన గ్రీన్ఫీల్డ్ ప్లాన్నే అమలు చేయాలి. ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం.
– కందుల రమేశ్, ఎన్హెచ్ బాధితుల సంఘం అధ్యక్షుడు, గుడిపేట