నార్నూర్, ఆగస్టు 20 : వైద్యరంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించడంతో ఆరోగ్య కేంద్రాల రూపురేఖలు మారిపోయాయనడానికి స్థానిక సీహెచ్సీయే దర్పణంగా నిలుస్తోంది. తగినంత సిబ్బందిని నియమించి, శిక్షణ ఇవ్వడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఆధునాతన యంత్ర సామగ్రిని ఇవ్వడంతో త్వరిగతిన వైద్య సేవలందేలా కృషి చేస్తున్నారు. సీహెచ్సీకి వ్యాధి నిర్ధారణ యంత్ర పరికరాలు అందజేసింది. పలు వైద్యపరీక్షలు చేసే అవకాశం కల్పించారు. ల్యాబ్ టెక్నీషియన్ ప్రత్యేకం గా నియమించారు.
హెచ్బీ, ప్లేట్లెట్ కౌంట్, బ్లడ్ గ్రూపు, హెచ్ఐవీ, హెచ్సీఎస్జీ, వీడీఆర్ఎల్, గల్ల పరీక్ష, ర్యాండం బ్లడ్ షుగర్, మలేరియా, డెంగీ, వైడల్, ఎస్ఓటీ, ఎస్జీపీటీ, ఏఎల్పీ, లిపిడ్ ప్రొఫైల్, సోడియం, పొటాషియం, క్లోరైడ్, యూరిన్ మైక్రోస్కోపిక్ వంటి 57 రకాల పరీక్షలు చేయనున్నారు. ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి తరిలించి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. పరీక్షల అనంతరం రోగికి సంబంధించిన మొబైల్కు ఫలితాల సమాచారం చేరవేస్తున్నారు.
గత ప్రభుత్వాల హయాంలో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందేవి కావు. చిన్న జ్వరం వచ్చినా పట్టణానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో రోగులకు ఆర్థిక భారంతో పాటు వ్యయ ప్రయాసాలకు గురయ్యేవారు. ఇప్పుడా పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. గ్రామాలకే వెళ్లి మెరుగైన వైద్య అందించాలనే లక్ష్యంతో 102, 108 అంబులెన్స్ వాహనాలను సైతం ఏర్పాటు చేసింది.
నార్నూర్లోని సీహెచ్సీ (సామాజిక ఆరోగ్య కేంద్రం) రోగులకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యానికి భరోసా కల్పించేలా మారింది. ఒకప్పుడు మెరుగైన వైద్య కోసం ఉట్నూర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ పట్టణాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యరంగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో 10-15 రకాల వైద్య సేవలు మాత్రమే అందేవి. ఇప్పుడు 57 రకాల సేవలు అందుబాటులోకి తీసుకురావడం, అవసరమైన నిర్ధారణ పరీక్షలకు వైద్య పరికరాలు,యంత్రాలు ఇవ్వడంతో మెరుగైన వైద్యం ప్రజల ముంగిటకే చేరింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అత్యాధునిక వైద్య పరికరాలు వచ్చాయి. 57 రకాల పరీక్షలు చేస్తున్నాం. పీహెచ్సీలో అన్ని రకాల టెస్టులు చేస్తున్నాం. ప్రైవేట్ ల్యాబ్లో వేల రూపాయలు ఖర్చు అయ్యే పరీక్ష ఇక్కడ ఉచితంగా చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో పని చేస్తు రోగులకు ప్రత్యేక్షంగా సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.
-రవీందర్, ల్యాబ్ టెక్నీషియన్
నూతన పరికరాలు అందుబాటులోకి రావడంతో 57రకాల వైద్య పరీక్షలు చేసేందుకు అవకాశం కలిగింది. ఇకపై వైద్య పరీక్షల కోసం పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. రోగులకు వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ అయిన తర్వాత అవసరమైన వైద్యాన్ని ఇక్కడే అందిస్తున్నాం. గతంలో ప్రభుత్వ దవాఖానలో పరీక్షలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడేవాళ్లు.
-రాంబాబు, వైద్యాధికారి, నార్నూర్